టెక్కలిలో విద్యుత్ షార్ట్సర్క్యూట్
రూ.4.50 లక్షల ఆస్తి నష్టం
సాక్షి,టెక్కలి(శ్రీకాకుళం): టెక్కలి మేజర్ పంచాయతీ కండ్రవీధిలో నివాసముంటున్న బంగారం వ్యాపారి కోరాడ వరప్రసాద్ ఇంట్లో శుక్రవారం మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. వరప్రసాద్ తల్లి సత్యవతి తన మనవడు రామసాయితో కలిసి ఇంట్లో వంట చేస్తున్న సమయంలో ఫ్రిజ్లో ఒక్కసారిగా పొగలు వచ్చాయి.
కొద్దిసేపటికే గది మొత్తం మంటలు వ్యాపించడంతో సత్యవతి తన మనవడితో కలిసి భయంతో బయటకు పరుగులు తీసింది. అప్పటికే పొగలు దట్టంగా వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాప కేంద్రానికి సమాచారం అందించారు. సిబ్బంది జె.దుర్గారావు, కె.మధు, నర్సింహులు తదితరులు హుటాహూటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో వంటగది కాలిబూడిదైంది. వెండి సామగ్రి దగ్ధం కావడంతో రూ.4లక్షల50వేలు వరకు ఆస్తినష్టం ఏర్పడినట్లు అగ్నిమాప అధికారి మల్లేశ్వరరావు తెలిపారు.
చదవండి: ప్రేమ.. పెళ్లి.. భర్తకు దూరంగా అద్దె ఇంట్లో.. చివరికి ఇలా..