రాష్ట్రంలో తొలిసారిగా కరోనాపై అధ్యయనం

13 Aug, 2020 04:26 IST|Sakshi
డాక్టర్‌ చంద్రశేఖర్, డాక్టర్‌ రోజారాణి

కేఎంసీ మైక్రోబయాలజీ వైద్యుల స్టడీ

88% మందిలో ఏ2ఏ జన్యువు గుర్తింపు

కర్నూలు (హాస్పిటల్‌): కరోనా వైరస్‌పై కర్నూలు మెడికల్‌ కాలేజీ (కేఎంసీ) మైక్రో బయాలజీ విభాగంలో బయో ఇన్ఫర్మాటిక్‌ అధ్యయనం చేశారు. కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) పరిధిలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జెనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ (ఐజీఐబీ)తో కర్నూలు ప్రాంతం నుంచి 90 మంది కరోనా బాధితుల శాంపిల్స్‌ సేకరించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌(ఎన్‌జీఎస్‌) చేశారు. ఈ వివరాలను బుధవారం కళాశాలలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌తో కలిసి మైక్రోబయాలజీ స్పెషలిస్టు డాక్టర్‌ పి.రోజారాణి విలేకరులకు వివరించారు. 

► చైనాలోని వూహాన్‌లో మొదలైన కోవిడ్‌–19 వైరస్‌తో పోలిస్తే కర్నూలులో ఉన్న వైరస్‌ కొద్దిగా మార్పులు చేసుకుంది.
► కర్నూలు ప్రాంతంలో 90 శాంపిల్స్‌ సేకరించి అధ్యయనం చేశారు. ఇందులో 88% మందిలో ఏ2ఏ అనే జన్యువు రూపంలో,  12% మందిలో ఎల్‌/ఏ3ఎల్‌ అనే రూపంలో ఉన్నట్లు తేలింది.
► అధ్యయన నివేదికలను ఐజీఐబీ సీనియర్‌ సైంటిస్ట్‌ వినోద్‌ స్కారియాకు పంపారు.
► ఇలాంటి అధ్యయనం వల్ల కోవిడ్‌–19 ఎలా మార్పులు చెందుతోంది, దానికి ఎలాంటి వ్యాక్సిన్‌ తయారు చేయాలి, వైరస్‌ను గుర్తించేందుకు ఎలాంటి ప్రోబ్స్‌ కావాలి, ఆర్‌టీ పీసీఆర్‌ కిట్స్‌ను వేటిని ఉపయోగించాలో తెలుస్తుంది.
► ఈ అధ్యయనానికి మైక్రోబయాలజీ హెచ్‌వోడీ డాక్టర్‌ సురేఖ, డాక్టర్‌ విజయలక్ష్మి సహకరించారు.
► జాతీయ స్థాయిలో ఆరు ప్రతిష్టాత్మక సంస్థలు ఈ అధ్యయనంలో పాల్గొన్నాయి. ఏపీ నుంచి మొదటి అధ్యయనం ఇదే.

మరిన్ని వార్తలు