సాక్షి, అమరావతి: ఏపీలో నేటితో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ముగిసాయి. రాష్ట్ర వ్యాప్తంగా 168 మండలాల్లో 3,249 పంచాయతీలు, 32,504 వార్డులకు తొలి దశలో ఎన్నికలు జరుగనుండగా, సర్పంచ్ పదవులకు 13వేలకు పైగా నామినేషన్లు, వార్డు మెంబర్ పదవులకు 35వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు (ఫిబ్రవరి 3న) తొలి విడత నామినేషన్ల పరిశీలన, అనంతరం నామినేషన్ల అభ్యంతరాలపై తుది నిర్ణయం వెలువడుతుంది. ఫిబ్రవరి 4న మధ్యాహ్నం 3గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 9న ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు సాగుతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాల వెల్లడి. ఫిబ్రవరి 9న సాయంత్రం ఉప సర్పంచ్ ఎన్నిక జరుగనుంది.