తెరచాపే తీరానికి చేర్చింది.. 

17 Oct, 2020 08:15 IST|Sakshi
పాడైన బోటులో మత్స్యకారులు

బోటు ఇంజిన్‌ పాడై నడిసంద్రంలో చిక్కుకున్న కాకినాడ మత్స్యకారులు 

అంతలో గాలివానతో తీవ్ర ఆందోళన   

తెరచాప సాయంతో క్షేమంగా చీరాల వాడరేవుకు..  

చీరాల టౌన్‌ : నడిసంద్రం.. ఇంజిన్‌ పాడైపోయిన బోటు.. కనుచూపు మేరలో మరో బోటు లేదు.. అంతలో పెనుగాలులు, ఎడతెరపి లేని వాన.. దిక్కుతోచని స్థితితో ఆ ఏడుగురు మత్స్యకారులు ప్రాణాలపై ఆశ వదులుకున్నారు. ఆ స్థితిలో వారిని తెరచాపే తీరానికి చేర్చింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మత్స్యకారులు శుక్రవారం ప్రకాశం జిల్లా చీరాల వాడరేవుకు చేరుకున్నారు. ఈ నెల 7వ తేదీన కాకినాడ ప్రాంతానికి చెందిన మత్స్యకారులు పేర్ల రాంబాబు, మైలిపల్లి సింగరాజు, గుంటి దుర్గ, గరికిన యల్లాజీ, గుంటి పోలయ్య, పేర్ల తాతారావు, కారె సింహాద్రిలు తమ బోటుతో కొత్తపాలెంలోని ఆయిల్‌ రిగ్‌ వద్ద లంగరు వేసి వేటాడుతున్నారు. ( మహోగ్ర వేణి )

ఈ నెల 10న వాయుగుండం కారణంగా గాలివాన ఎక్కువవడంతో వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించగా ఇంజిన్‌ పనిచేయలేదు. ఆ సమయంలో బోటుకు ఉన్న తెరచాప సాయంతో ప్రయాణాన్ని మొదలెట్టారు. తిండి గింజలు అయిపోవడంతో రెండ్రోజులు మంచినీళ్లు మాత్రమే తాగారు. ఆ దశలో వారిని నిజాంపట్నం–బాపట్ల తీర ప్రాంతంలోని మత్స్యకారులు గుర్తించి మెరైన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మెరైన్‌ పోలీసులు వెంటనే స్పందించి వారిని చీరాల వాడరేవు ఒడ్డుకు చేర్చారు.

మరిన్ని వార్తలు