కడలివైపు కృష్ణమ్మ, పెన్నమ్మ 

20 Sep, 2020 05:15 IST|Sakshi
శ్రీశైలం నుంచి పది గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్న దృశ్యం

శ్రీశైలం ప్రాజెక్ట్‌ పది గేట్లు ఎత్తివేత 

ప్రకాశం బ్యారేజీ నుంచి 2.24 లక్షల క్యూసెక్కులు కడలిలోకి 

పోటెత్తిన పెన్నా, పాపాఘ్ని, కుందూ.. మైలవరం, గండికోట, సోమశిల గేట్లు ఎత్తివేత 

ధవళేశ్వరం నుంచి 3.55 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి 

సాక్షి, అమరావతి/ శ్రీశైలం ప్రాజెక్ట్‌/ విజయపురి సౌత్‌ (మాచర్ల): పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం మరింత పెరిగింది. శనివారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు పది రేడియల్‌ క్రస్ట్‌ గేట్లను 15 అడుగుల మేరకు తెరచి 3,77,160 క్యూసెక్కులు, కుడిగట్టు కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ మరో 26,777 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారు. కుడిగట్టు కేంద్రంలో 14.47 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు.  

► నాగార్జునసాగర్‌ జలాశయం నుంచి 20 గేట్ల ద్వారా 3,40,344 క్యూసెక్కులు, పులిచింతల ప్రాజెక్టు నుంచి 3,56,872 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. 
► ప్రకాశం బ్యారేజీ నుంచి మిగులుగా ఉన్న 2,24,468 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు.  పెన్నా, ఉప నదులు పాపాఘ్ని, కుందూ పోటెత్తి ప్రవహిస్తున్నాయి. దీంతో గండికోట, మైలవరం, సోమశిల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు.  
► సోమశిల నుంచి కండలేరుకు, అక్కడి నుంచి మిగులుగా ఉన్న 60 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పెన్నమ్మ సముద్రం వైపు పరుగులు తీస్తోంది.  గోదావరిలోనూ వరద ప్రవాహం పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి మిగులుగా ఉన్న 3,55,011 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు