శ్రీశైలానికి పెరిగిన వరద

8 Sep, 2022 03:39 IST|Sakshi
శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు

2.86 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

నాగార్జున సాగర్‌కు 1.47 లక్షల క్యూసెక్కులు రాక

సాగర్‌ నుంచి 1.46 లక్షల క్యూసెక్కులు విడుదల

శ్రీౖశైలం ప్రాజెక్ట్‌/ విజయపురిసౌత్‌/సత్రశాల(రెంటచింతల): శ్రీశైలం జలాశయానికి బుధవారం వరద ప్రవాహం పెరిగింది. జూరాల, సుంకేసుల నుంచి 2,86,738 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలానికి వస్తోంది. ప్రవాహం పెరగడంతో 3 గేట్లను 10 అడుగుల మేరకు తెరచి 83,949 క్యూసెక్కులు నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రాల నుంచి 65,197 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

బ్యాక్‌వాటర్‌ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 15 వేల క్యూసెక్కులు, హంద్రీ నీవా సుజల స్రవంతికి 1,688 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 800 క్యూసెక్కులు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 214.36 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్‌ నీటిమట్టం 884.80 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌ జలాశయానికి 1,47,009 క్యూసెక్కుల నీరు వస్తోంది.

సాగర్‌ జలాశయం నుంచి 1,46,629 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 16 రేడియల్‌ క్రస్ట్‌ గేట్ల ద్వారా 96,444 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన ద్వారా 32,805 క్యూసెక్కులు.. మొత్తం 1,29,249 క్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణానదిలోకి విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ కాల్వలు, వరద కాల్వ, ఎస్‌ఎల్‌బీసీల ద్వారా 17,380 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు సాగర్‌ జలాశయం నీటిమట్టం 589.40 అడుగులుండగా 310.2522 టీఎంసీలు నీరు ఉంది. 

మరిన్ని వార్తలు