శ్రీశైలంలోకి పెరిగిన వరద

29 Aug, 2022 03:13 IST|Sakshi
సాగర్‌ నుంచి దిగువకు ప్రవహిస్తున్న కృష్ణమ్మ

జూరాల, సుంకేశుల నుంచి వస్తున్న 2.79 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

7 గేట్లు పదడుగులు ఎత్తి 1.96 లక్షల క్యూసెక్కులు దిగువకు

కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి

సాగర్‌లోకి 2.09 లక్షల క్యూసెక్కుల ప్రవాహం.. అదేస్థాయిలో దిగువకు

ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 1.45 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి

సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్‌/విజయపురిసౌత్‌/సత్రశాల (రెంటచింతల): కృష్ణా ప్రధానపాయపై నారాయణపూర్‌ డ్యామ్‌కు దిగువన.. తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి మళ్లీ వరద పెరిగింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు జూరాల, సుంకేశుల బ్యారేజ్‌ల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,79,268 క్యూసెక్కులు చేరుతుండగా.. గరిష్టస్థాయిలో అంటే 885 అడుగుల్లో 215.80 టీఎంసీలను నిల్వచేస్తూ పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 20 వేలు, హంద్రీ–నీవా ద్వారా 1,688, కల్వకుర్తి ద్వారా 1,967 క్యూసెక్కులు తరలిస్తున్నారు.

స్పిల్‌ వే ఏడుగేట్లను పదడుగులు ఎత్తి 1,96,525 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ కుడిగట్టు కేంద్రం ద్వారా 30,924, ఎడమగట్టు కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 2,09,791 క్యూసెక్కుల నీరు చేరుతోంది. కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీ, వరద కాలువలకు 17,246 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. స్పిల్‌ వే గేట్ల ద్వారా, విద్యుదుత్పత్తి చేస్తూ 1,93,185 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 588.9 అడుగుల్లో 308.76 టీఎంసీలను నిల్వచేస్తున్నారు.

పులిచింతలలోకి 1,82,816 క్యూసెక్కులు చేరుతుండగా.. 169.79 అడుగుల్లో 38.04 టీఎంసీలను నిల్వచేస్తూ స్పిల్‌వే గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 1,69,871 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి 1,60,937 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణాడెల్టాకు 15,687 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగిలిన 1,45,250 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. కృష్ణా బేసిన్‌లో ఎగువన మరో రెండ్రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న భారత వాతావరణ సంస్థ అంచనాల నేపథ్యంలో కృష్ణాలో వరద ఉధృతి మరో 3, 4 రోజులు ఇదే రీతిలో కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.  

మరిన్ని వార్తలు