డిస్ట్రిబ్యూటర్ల నకిలీ లేఖలు కలకలం

4 Jan, 2022 11:04 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: సినిమా టికెట్‌ ధరల వ్యవహారం విశాఖలో కాకరేపుతోంది. ప్రభుత్వంపై బురదజల్లడానికి ఒక వర్గం ప్రయత్నిస్తుందన్న వార్తలు ఇప్పుడు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. చోడవరానికి చెందిన ఒక ఎగ్జిబిటర్‌ తమ ప్రమేయం లేకుండా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేశారంటూ మిగిలిన ఎగ్జిబిటర్లు మండిపడుతున్నారు. ఈ విషయాన్ని చెప్పకుండా తమతో సంతకాలు చేయించుకున్నారంటూ.. గత నెల 25న జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డికి ఫిర్యాదు చేయడం సినీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పెద్ద... చిన్న సినిమాలనే తారతమ్యం లేకుండా అన్ని సినిమా థియేటర్లలో ఆడాలి.. ప్రజలకు అందుబాటు ధరల్లో టికెట్‌ ఉండే విధంగా ప్రభుత్వం జీవో–35 జారీ చేసింది. దీనిపై ఎగ్జిబిటర్లు వ్యతిరేకంగా ఉన్నారంటూ కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు నకిలీ లేఖలు సృష్టించి కేసులు వేశారు. ఆ సమయంలో కోర్టుకు సమర్పించిన లేఖల్లో నకిలీవని కొంతమంది ఎగ్జిబిటర్లు చెబుతుండడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. డిస్ట్రిబ్యూటర్లలో ఒక వర్గం వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను, సినీ వర్గాల వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.  

జేసీ ఆదేశాల మేరకే టిక్కెట్ల రేట్లు  
జీవో 35 రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సినిమా టికెట్‌ ధరలు పాత విధానంలో అమలు చేయాలా.. లేదా అనేది జేసీ ఆదేశాల మేరకు నిర్ణయించాలని పేర్కొంది. కోర్టుని ఆశ్రయించిన వారెవరూ ఇప్పటి వరకు తనని సంప్రదించలేదని జేసీ ఇప్పటికే వెల్లడించారు. మరోవైపు థియేటర్లలో అన్ని సౌకర్యాలు, టికెట్‌ల ధరలు సవ్యంగా ఉన్నాయో లేదో జిల్లా అధికారులు తనిఖీలు ముమ్మురంగా చేస్తున్నారు.  

థియేటర్‌లో తప్పక ఉండాల్సినవి ఇవే.. 
►ఫైర్‌ సేఫ్టీ సర్టిఫికెట్, ఎలక్ట్రికల్‌ సర్టిఫికెట్‌ 
►బిల్డింగ్‌ స్ట్రెంగ్త్‌ను తెలియజేసే ఆర్‌అండ్‌బీ అనుమతి 
►ఫిలిమ్‌ డివిజన్‌ నుంచి అనుమతి పత్రం 
►క్యాంటీన్‌ నిర్వహణ కోసం ఫుడ్‌లైసెన్స్‌ 
►ఇవన్నీ రెవెన్యూ విభాగం వారికి సమర్పించి ‘ఫామ్‌–బి’సర్టిఫికెట్‌ పొందాలి.  

విచారణ చేస్తున్నాం 
హైకోర్టుని ఆశ్రయించామని చెప్పిన జిల్లాకి చెందిన 9 థియేటర్ల ఎగ్జిబిటర్లలో ఏడుగురు వారం రోజుల క్రితం తనకు ఫిర్యాదు చేశారు. తమకు అసలు విషయం చెప్పకుండా ఎగ్జిబిటర్‌ల అసోసియేషన్‌కి చెందిన చోడవరం థియేటర్‌ యాజమాని ఒకరు తమ దగ్గర సంతకాలు చేయించుకున్నారని చెప్పారు. ఇదంతా తమ ప్రమేయం లేకుండానే జరిగిందని, విచారణ చేయాలని కోరారు. ప్రభుత్వ జీవోకు తామంతా ఆమోదయోగమేనని కోర్టుకి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని ఫిర్యాదులో తెలిపారు.  
– వేణుగోపాల్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ 

చదవండి: Vizag Beach: ఎక్కువ ప్రమాదాలు ఆ నెలల్లోనే!

మరిన్ని వార్తలు