Football Player Murder In Vijayawada: విజయవాడలో దారుణం.. ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ హత్య

1 Jun, 2022 11:33 IST|Sakshi

విజయవాడలోని గురునానక్‌ కాలనీలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. జక్కంపూడికి చెందిన ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ ఆకాష్‌ దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

వివరాల ప్రకారం.. వాంబే కాలనీలో రౌడీ షీటర్‌ టోని రెండు రోజుల క్రితం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, ఆకాశ్‌, ప్రభాకర్‌ మరికొంత మంది టోని గ్యాంగ్‌లో పని చేస్తున్నారు. ఇక, టోని అంత్యక్రియల అనంతరం వీరంతా ఓ బార్‌లో ఫుల్లుగా మద్యం సేవించారు. ఈ క్రమంలోనే టోని గ్యాంగ్‌లోని ప్రభాకర్‌ బ్యాచ్‌, ఆకాశ్‌ గ్యాంగ్‌ మధ్య వివాదం చెలరేగింది. ఆ సందర్భంలోనే పోలీసులు అక్కడికి వస్తున్నారని వారంతా బార్‌ నుంచి వెళ్లిపోయారు. 

తర్వాత మంగళవారం రాత్రి ప్రభాకర్‌ గ్యాంగ్‌.. ఆకాశ్‌ ఉంటున్న ఇంట్లోకి వెళ్లి అతడిపై దాడి చేశారు. కత్తులతో దాడి చేయడంతో ఆకాశ్‌ ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆకాశ్‌ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోస్టువార్టం నిర్వహిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. టోని గ్యాంగ్‌పై ఫోకస్‌పెట్టారు. టోని అంత్యక్రియల్లో ఎవరెవరు పాల్గొన్నారనే అంశంపై దృష్టిసారించారు. ఇక, ఆకాశ్‌ మృతి కేసులో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు.. ఆకాశ్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ కాగా కొన్ని టోర్నీల్లో కప్‌లు కూడా సాధించాడు. 

 

మరిన్ని వార్తలు