Pydithalli Ammavaru: అమ్మవారి హుండీల్లో ఫారిన్‌ కరెన్సీ

23 Jun, 2022 12:31 IST|Sakshi

విజయనగరం టౌన్‌: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లి అమ్మవారికి భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల ఆదాయాన్ని బుధవారం స్థానిక శివాలయం వీధిలో ఉన్న పైడితల్లి అమ్మవారి కల్యాణ మంటపంలో లెక్కించారు. 90రోజులకు సంబంధించి చదురుగుడి, వనంగుడి హుండీల్లో సమకూరిన ఆదాయాన్ని లెక్కించగా వాటిలో  ఫారిన్‌ కరెన్సీని అమ్మవారికి భక్తులు కానుకలుగా అందజేశారు.  

18 డాలర్స్‌ యుఎస్‌ఏ కరెన్సీ,  పది సింగపూర్‌ డాలర్స్,  కువైట్‌కు ఒక దినార్, యుఏఈకి చెందిన 10 దిర్‌హమ్స్, నేపాల్‌కు 10 రూపీస్‌ విదేశీ కరెన్సీని ఆదాయం లెక్కింపు సందర్భంగా హుండీల్లో గుర్తించినట్లు ఆలయ ఈఓ బీహెచ్‌వీఎస్‌ఎన్‌ కిశోర్‌ కుమార్‌ వెల్లడించారు.  చదురుగుడి హుండీల నుంచి  రూ.35 లక్షల 18వేల 290 నగదు,  50 గ్రాములు 100 మిల్లీగ్రాముల బంగారం, 601 గ్రాముల వెండి లభించాయన్నారు. అలాగే వనంగుడి హుండీల నుంచి  రూ.7  లక్షల 13వేల 082 నగదు, ఒక గ్రా ము 40 మిల్లీగ్రాముల బంగారం, 45 గ్రాముల వెండి లభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో  పైడితల్లి భక్తబృందం సేవా సమితి సభ్యులు, పాలకమండలి సభ్యులు, కెనరా బ్యాంక్‌ సిబ్బంది  పాల్గొన్నారు.  

(చదవండి: ఔను... ఆయనకు ఉద్యోగం వచ్చింది)

మరిన్ని వార్తలు