కరోనాతో మాజీ మంత్రి నాగిరెడ్డి కన్నుమూత

16 May, 2021 11:13 IST|Sakshi
గరుడమ్మగారి నాగిరెడ్డి (ఫైల్‌)

ధర్మవరం: కరోనాతో మాజీ మంత్రి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గరుడమ్మగారి నాగిరెడ్డి(68) శనివారం మృతి చెందారు. పదిరోజుల క్రితం కరోనాతో బాధపడుతున్న ఆయనను అనంతపురంలోని ఓప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గరుడమ్మగారి నాగిరెడ్డి ధర్మవరం నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా 1983, 1985, 1989లో టీడీపీ తరఫున ఎన్నికయ్యారు.

తెలుగు సాహిత్యం మీద అవగాహన ఉన్న నాగిరెడ్డి సొంతంగా పత్రిక పెట్టి సంపాదకునిగా వ్యవహరించారు. ఈ పరిచయంతోనే టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పార్టీలో చేర్చుకుని టీడీపీ టికెట్‌ ఇచ్చారు.  మూడో దఫా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన చేనేత జౌళి, చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు. భార్య సునీత, కుమారుడు సతీష్‌రెడ్డి ఉండగా.. కుమారుడు 2016లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. కుమారుని మరణంతో రాజకీయాలకు స్వస్తి పలికి ఆయన ఇంటికే పరిమితమయ్యారు. నాగిరెడ్డి మృతి పట్ల ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

చదవండి: సినీ గేయ రచయిత అదృష్ట దీపక్‌ కన్నుమూత 
కానిస్టేబుల్‌ ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే దుద్దుకుంట 

మరిన్ని వార్తలు