రూ.15,591 కోట్ల ప్రాజెక్టులకు 16న శంకుస్థాపనలు

4 Oct, 2020 05:10 IST|Sakshi
కనకదుర్గమ్మ ఫ్లైఓవర్‌

పాల్గొననున్న కేంద్ర మంత్రి గడ్కరీ, సీఎం వైఎస్‌ జగన్‌ 

రూ.7,584.68 కోట్లతో చేపట్టనున్న రహదారులకు శంకుస్థాపన

రూ.8,007.22 కోట్లతో పూర్తయిన ప్రాజెక్టులు జాతికి అంకితం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.7,584.68 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ప్రాజెక్టులకు శంకుస్థాపన, రూ.8,007.22 కోట్లతో పూర్తయిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం కార్యక్రమాలను ఈ నెల 16న నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి శంకర నారాయణ శనివారం  తెలిపారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, సీఎం వైఎస్‌ జగన్‌లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గత నెల 18వ తేదీన ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా, కేంద్ర మంత్రి గడ్కరీకి కరోనా సోకడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. 

► ఏపీలో 878.4 కి.మీ. మేర కొత్తగా జాతీయ రహదారుల్ని రూ.7,584.68 కోట్లతో నిర్మించనున్నారు. రూ.8,007.22 కోట్లతో పూర్తయిన 532.696 కి.మీ. మేర రహదారుల నిర్మాణం, ఆర్వోబీలను జాతికి అంకితం చేయనున్నారు. అంటే మొత్తంగా ఈ ప్రాజెక్టుల విలువ రూ.15,591.9 కోట్లు. కాగా, మొత్తం రహదారులు 1,411.096 కిలోమీటర్లు. మొత్తం 16 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పది ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వనున్నారు. 
► శంకుస్థాపనలు జరిగే 16 ప్రాజెక్టుల్లో.. రూ.2,225 కోట్లతో చేపట్టనున్న రేణిగుంట– నాయుడుపేట ఆరులేన్ల రహదారి, రూ.1,225 కోట్లతో చేపట్టనున్న విజయవాడ బైపాస్, రూ.1,600 కోట్లతో నిర్మించనున్న గొల్లపూడి–చినకాకాని ఆరు లేన్ల రహదారితోపాటు కృష్ణా నదిపై మేజర్‌ బ్రిడ్జి ముఖ్యమైనవి.
► జాతికి అంకితం చేసే ప్రాజెక్టుల్లో.. రూ.2,075 కోట్లతో నిర్మించిన కడప–మైదుకూరు–కర్నూలు నాలుగు లేన్ల రహదారి (ఎన్‌హెచ్‌–40), రూ.1,470 కోట్లతో చేపట్టిన విజయవాడ–మచిలీపట్నం నాలుగు లేన్లు (బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌తో కలిపి), రూ.1,100 కోట్లతో చేపట్టిన నలగంపల్లి–ఏపీ/కర్ణాటక సరిహద్దు నాలుగు లేన్లు, రూ.1,470 కోట్లతో నిర్మించిన రణస్థలం–ఆనందపురం ఆరు లేన్ల రోడ్డు, రూ.501 కోట్లతో చేపట్టిన కనకదుర్గ గుడి ఆరు లేన్ల ఫ్లై ఓవర్‌ ముఖ్యమైనవి.

మరిన్ని వార్తలు