108లో నలుగురి జననం

9 Sep, 2021 04:26 IST|Sakshi
తూర్పుగోదావరి జిల్లాలో 108లో జన్మించిన కవల పిల్లలు

కవల పిల్లలకు జన్మనిచ్చిన ఓ తల్లి 

మరో రెండు చోట్ల వాహనంలోనే ప్రసవం చేసిన సిబ్బంది  

మాకవరపాలెం/గూడెంకొత్తవీధి/రౌతులపూడి: 108 వాహనాల్లో బుధవారం నలుగురు చిన్నారులు జన్మించారు. మూడో చోట్ల జరిగిన ఈ ఘటనల్లో ఓ తల్లి కవలలకు జన్మనివ్వడం విశేషం. విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం మామిడిపాలేనికి చెందిన భవానికి బుధవారం పురిటినొప్పులొచ్చాయి. కుటుంబ సభ్యులు 108కి సమాచారం ఇవ్వగా సిబ్బంది వచ్చి గర్భిణిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తీసుకెళుతున్నారు. అయితే మార్గం మధ్యలోనే ప్రసవమై మగబిడ్డకు జన్మనిచ్చిందని 108 సిబ్బంది వినీత, మురళి తెలిపారు. అలాగే చింతపల్లి మండలం చెరపల్లికి చెందిన దేవూరు సుమలతకు పురిటి నొప్పులు రావడంతో 108కి సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా నొప్పులు తీవ్రమయ్యాయి. దీంతో 108 సిబ్బంది వాహనంలోనే ఆమెకు ప్రసవం చేశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్టు సిబ్బంది రాజు, రెహమాన్‌లు చెప్పారు.  

గర్భిణికి సుఖప్రసవం.. కవలల జననం
తూర్పుగోదావరి జిల్లా శంఖవరానికి చెందిన శివకోటి అనంతలక్ష్మికి పురిటి నొప్పులు రావడంతో మంగళవారం రౌతులపూడి సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అయితే పరిస్థితి కొద్దిగా ఆందోళనకరంగా ఉందని అక్కడి డాక్టర్‌.. కాకినాడ జీజీహెచ్‌కు తరలించాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు బుధవారం తెల్లవారుజామున 108లో ఆమెను తరలిస్తుండగా వాహనంలోనే కవలలు(ఆడ, మగ)కు జన్మనిచ్చింది.  ఆ తర్వాత తల్లీబిడ్డలను జీజీహెచ్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు