గుడ్‌న్యూస్‌: ఈ రూట్లలో సంక్రాంతి పండుగకి ప్రత్యేక రైళ్లు

5 Jan, 2023 16:26 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం కాచిగూడ–శ్రీకాకుళం రోడ్‌–వికారాబాద్‌ మధ్య వయా దువ్వాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి ఓ ప్రకటనలో తెలిపారు.  
కాచిగూడ–శ్రీకాకుళం రోడ్‌(07611) రైలు: కాచిగూడలో ఈ నెల 10న సాయంత్రం 6.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45కు దువ్వాడ చేరుతుంది. తిరిగి 5.47కు బయలుదేరి అదే రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్‌ చేరుకుంటుంది.  
శ్రీకాకుళం రోడ్‌–వికారాబాద్‌(07612) రైలు: శ్రీకాకుళం రోడ్‌లో ఈ నెల 11న మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి అదే రోజు సాయత్రం 5.10కు దువ్వాడ చేరుకుని, తిరిగి 5.47కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50గంటలకు వికారాబాద్‌ చేరుకుంటుంది.  
వికారాబాద్‌–శ్రీకాకుళంరోడ్‌(07613) స్పెషల్‌:  వికారాబాద్‌లో ఈ నెల 12న సాయంత్రం 4 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.45కు దువ్వాడ చేరుతుంది. తిరిగి 5.47కు బయలుదేరి అదే రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్‌ చేరుకుంటుంది.  
శ్రీకాకుళం రోడ్‌–కాచిగూడ(07614) స్పెషల్‌:  శ్రీకాకుళం రోడ్‌లో ఈ నెల 13న మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం 5.20కు దువ్వాడ చేరుకుని, తిరిగి 5.22కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.  

రైళ్ల గమ్యం కుదింపు, దారి మళ్లింపు.. 
వాల్తేర్‌ డివిజన్‌ కే–ఆర్‌ లైన్‌ కోరాపుట్‌–మనబర్, కోరాపుట్‌–దుమురిపుట్‌ సెక్షన్ల మధ్య జరుగుతున్న ట్రాక్‌ ఆధునికీకరణ, రెండో ట్రాక్‌ పనుల నిమిత్తం పలు రైళ్ల గమ్యం కుదిస్తున్నట్లు, మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు ఎ.కె.త్రిపాఠి తెలిపారు. 
విశాఖపట్నం–కోరాపుట్‌(08546) పాసింజర్‌ స్పెషల్‌ ఈ నెల 5 నుంచి 10 వరకు లక్ష్మీపూర్‌ రోడ్‌ వరకు మాత్రమే నడుస్తుంది.  కోరాపుట్‌–విశాఖపట్నం(08545) పాసింజర్‌ స్పెషల్‌ ఈ నెల 6 నుంచి 11 వరకు లక్ష్మీపూర్‌ రోడ్‌ నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటుంది.  
విశాఖపట్నం–కోరాపుట్‌(08512) ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 6, 9 తేదీల్లో దమన్‌జోడి వరకు మాత్రమే నడుస్తుంది. కోరాపుట్‌–విశాఖపట్నం(08511) ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 7, 10 తేదీల్లో దమన్‌జోడి నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటుంది.  
ఈ నెల 6న విశాఖలో బయలుదేరే విశాఖపట్నం–కిరండూల్‌(08551) పాసింజర్‌ స్పెషల్‌ అరకు వరకు మాత్రమే నడుస్తుంది.  
ఈ నెల 6న కిరండూల్‌లో బయలుదేరే కిరండూల్‌–విశాఖపట్నం(08552) పాసింజర్‌ స్పెషల్‌ జయపూర్‌ వరకు మాత్రమే నడుస్తుంది.   

మరిన్ని వార్తలు