-

కరోనా రోగులకు మరింత అందుబాటులోకి ఉచిత వైద్యం

8 May, 2021 03:45 IST|Sakshi

కోవిడ్‌ ఆస్పత్రులుగా ప్రకటించిన అన్ని ప్రైవేటు, బోధనాస్పత్రుల్లో 100 శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకే..

అలాగే కోవిడ్‌ చికిత్సకు ప్రకటించిన ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్లు కేటాయిస్తూ సర్కార్‌ ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: కరోనా రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలను ప్రభుత్వం మరింత అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రూపాయి కూడా ఖర్చు చేయకుండా పూర్తి ఉచితంగా చికిత్సను అందించడానికి పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఉత్తర్వుల ప్రకారం.. 
► కోవిడ్‌ ఆస్పత్రులుగా ప్రకటించిన అన్ని ప్రైవేటు, బోధనాస్పత్రుల్లో పూర్తిగా 100 శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ కింద కేటాయించి ఉచితంగా వైద్య సేవలు అందించాలి. పరిస్థితులు, అవసరాన్ని బట్టి జిల్లా కలెక్టర్లు మరికొన్నిటిని కోవిడ్‌ ఆస్పత్రులుగా ప్రకటించాలి.

► కోవిడ్‌ చికిత్స కోసం ప్రకటించిన ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో కూడా కనీసం 50 శాతం బెడ్లను కేటాయించాలి. 50 శాతం కోటా పూర్తయినప్పటికీ, సంబంధిత ఆస్పత్రిలో ఇతర బెడ్లు ఖాళీగా ఉంటే వాటిని కూడా ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ఇవ్వాలి. 

► అలాగే తాత్కాలికంగా కోవిడ్‌ చికిత్స కోసం మరిన్ని ప్రైవేటు ఆస్పత్రులను ఆరోగ్యశ్రీ ఎంప్యానల్‌మెంట్‌ హాస్పిటల్స్‌గా జిల్లా కలెక్టర్లు గుర్తించాలి. వీటిలో కూడా 50 శాతం బెడ్లు కేటాయించాలి. వీటి చికిత్సా వ్యయాన్ని వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ భరిస్తుంది.

► తాత్కాలికంగా ఆరోగ్యశ్రీ ఎంప్యానల్‌మెంట్‌ ఆస్పత్రులుగా గుర్తించిన వాటి వివరాలను జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవోకి అందించాలి.

► ప్రతి సమయంలోనూ 50 శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ఖాళీగా ఉంచాలని చెప్పి నాన్‌ ఆరోగ్యశ్రీ కార్డు హోల్డర్ల చికిత్సను తిరస్కరించాల్సిన అవసరం లేదు. ఆరోగ్య పరీక్షల ఆధారంగా బెడ్‌ కేటాయించవచ్చు.

► సుప్రీంకోర్టు మార్గదర్శకాలకనుగుణంగా రాష్ట్రంలో అన్ని ఆస్పత్రులు ఈ నిబంధనలు పాటించాలి.

► ఆస్పత్రుల్లో చికిత్స కోసం వచ్చిన రోగులను పాజిటివ్‌ టెస్టు లేదంటూ తిరస్కరించకూడదు.

► ఆస్పత్రిలో చేరిక అనేది పూర్తిగా అవసరాన్ని బట్టి లేదా డాక్టర్‌ లేదా రోగుల పరీక్షల నిర్ధారణపై ఆధారపడి ఉంటుంది.

► వివిధ కారణాలను చూపుతూ ఒక్క రోగి కూడా చికిత్స లేదా కావాల్సిన ఔషధాలకు దూరం కాకుండా చూడాలి.

చదవండి:

కరోనా కన్నా వారికి భయంకరమైన లక్షణాలు: కొడాలి నాని

ఆక్సిజన్ కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు  

మరిన్ని వార్తలు