14వ విడత ఉచిత పంపిణీలో ఈ దఫా శనగలు
1,51,84,764 కుటుంబాలకు ప్రయోజనం
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేదలకు ఈ నెల 20 నుంచి ఉచిత సరుకులను పంపిణీ చేయనున్నారు. పౌర సరఫరాల సంస్థ ఏపీలోని అన్ని రేషన్ షాపులకు సరుకులను సరఫరా చేసింది. నెలకు 2 విడతలు చొప్పున ఏప్రిల్ కోటా నుంచి ప్రారంభించి.. ఇప్పటికి 13 సార్లు పంపిణీని పూర్తిచేశారు. ఈ విడతలో లబ్ధిదారులకు బియ్యం, శనగలు ఇస్తారు.
70 వేల మందికి కొత్త కార్డులు..
ఇప్పటికే కార్డులుండి వివిధ కారణాలతో అనర్హులుగా ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. అనర్హులుగా పరిగణించిన కార్డుదారుల్లో ఎక్కువ మంది తాము అర్హులమేనని, ఒక కుటుంబ సభ్యుడు ఆదాయపు పన్ను చెల్లిస్తే మొత్తం కార్డునే రద్దు చేశారంటూ ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ విషయం సీఎం వైఎస్ జగన్ దృష్టికి వెళ్లడంతో సమస్యను వెంటనే పరిష్కరించారు. దీంతో 70 వేల కుటుంబాలకు కొత్తగా కార్డులు మంజూరయ్యాయి.