కృష్ణా, గోదావరిలో మరింత తగ్గిన వరద

23 Aug, 2022 05:24 IST|Sakshi

సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్‌/విజయపురిసౌత్‌: పరివాహక ప్రాంతాల్లో (బేసిన్‌లో) వర్షపాత విరామంతో నదుల్లో వరద ప్రవాహం క్రమేణ తగ్గుతోంది. జూరాల, సుంకేశుల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతున్న కృష్ణాజలాల ప్రవాహం 1,76,232 క్యూసెక్కులకు తగ్గింది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్, కల్వకుర్తి, హంద్రీ–నీవా ద్వారా 21,288 క్యూసెక్కులను తరలిస్తున్నారు. ప్రాజెక్టులో 884.4 అడుగుల్లో 211.95 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ, స్పిల్‌ వే మూడు గేట్లను పదడుగులు ఎత్తి మొత్తం 1,46,469 దిగువకు వదులుతున్నారు. సాగర్‌లోకి 97,724 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీ, వరద కాలువల ద్వారా 20,039 క్యూసెక్కులు తరలిస్తున్నారు.

ప్రధాన విద్యుత్‌కేంద్రం, స్పిల్‌ వే గేట్ల ద్వారా 76,305 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 587.7 అడుగుల్లో 305.92 టీఎంసీల నీరు ఉంది. పులిచింతల ప్రాజెక్టులోకి 85 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఇక్కడ 171.14 అడుగుల్లో 38.55 టీఎంసీలను నిల్వచేస్తూ.. స్పిల్‌ వే గేట్లు, విద్యుత్‌కేంద్రం ద్వారా 58,562 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి 1,10,527 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణాడెల్టాకు 15,037 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. మిగిలిన 95,490 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.

సాధారణ స్థాయికి గోదావరి
వర్షాలు తెరపి ఇవ్వడంతో ఉపనదుల్లో వరద తగ్గి గోదావరిలో ప్రవాహం సాధారణ స్థాయికి చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 4,89,531 క్యూసెక్కులు చేరుతుండగా, గోదావరి డెల్టాకు 9,467 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగిలిన 4,80,064 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.

స్థిరంగా వంశ‘ధార’
వంశధార నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజ్‌లోకి 24,399 క్యూసెక్కులు చేరుతుండగా, వంశధార ఆయకట్టుకు 2,231 క్యూసెక్కులను, 19,636 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. నాగావళి నుంచి తోటపల్లి బ్యారేజ్‌లోకి 8,649 క్యూసెక్కులు చేరుతుండగా, ఆయకట్టుకు 1,520 క్యూసెక్కులను విడుదల చేస్తూ, 1,851 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. 

మరిన్ని వార్తలు