గడప గడపలో ఆప్యాయత 

24 May, 2022 11:47 IST|Sakshi

ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి అపూర్వ స్వాగతం

నెల్లూరు(సెంట్రల్‌) : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆప్యాయత దక్కుతోంది. ప్రభుత్వం అందించే పథకాల వివరాలు తెలుసుకుంటున్నందుకు స్థానిక ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, మీకు మా ఆశీస్సులు ఉంటాయని దీవిస్తున్నారు.

సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం, విరువూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సోమవారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ, మీకు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల తీరును తెలుసుకునే కొత్త ఒరవడికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

నెల్లూరు రూరల్‌ పరిధిలోని పెనుబర్తిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోమవారం కొనసాగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, సంక్షేమ పథకాల అమలు గురించి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నివర్గాల ప్రజల కోసం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలియజేశారు.  

మరిన్ని వార్తలు