Gas Leakage Incident: ఆసుపత్రి నుంచి బాధితులు డిశ్చార్జి

4 Jun, 2022 10:57 IST|Sakshi

సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం గ్యాస్ లీకేజీ ఘటనలో ఎస్ఈజెడ్‌లోని ప్రమాద ప్రాంతాన్ని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ఎమ్మెల్యే కన్నబాబు రాజు, ఎంపీ డాక్టర్ సత్యవతి శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఘటనా స్థలంలో కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. గ్యాస్ లీక్ ఎలా అయింది అన్న విషయంపై ఆరా తీశారు. అయితే, దీనిపై స్పష్టత లేకపోవడంతో మంత్రి అమర్నాథ్ ఏపీఐఐసీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించాము. రెండు కంపెనీల్లో ఉద్యోగులు ఎక్కువగా అస్వస్థతకు గురయ్యారు. ఎక్కడ నుంచి విష వాయువులు వచ్చాయన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎస్ఈజెడ్‌లో ప్రమాదాల నివారణ చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తాము. ముందుగా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే మా ఉద్దేశ్యం’’ అని అన్నారు 

కోలుకుంటున్న బాధితులు
ఇదిలా ఉండగా.. గ్యాస్‌ లీక్‌ ఘటనలో అస్వస్థతకు గురైన బాధితులు కోలుకుంటున్నారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధితులు డిశ్చార్జి అవుతున్నారు. శనివారం ఉదయం ఎలమంచిలి ఆసుపత్రి నుంచి కోలుకున్న బాధితులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఇక, మరికొన్ని ఆసుపత్రుల్లో కొందరు బాధితులు చికిత్స పొందుతున్నారు. వారికి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి డిశ్చార్జి చేయాలని వైద్యులకు కలెక్టర్‌ సూచించారు. 
ఇది కూడా చదవండి:  '124 మంది చికిత్స పొందుతున్నారు.. ఎవరికీ ప్రాణాపాయం లేదు'

మరిన్ని వార్తలు