జలవిద్యుత్‌ కేంద్రాలను పరిశీలించిన జెన్‌కో ఎండీ

9 Jan, 2022 05:11 IST|Sakshi
డొంకరాయి జలాశయం వద్ద జెన్‌కో మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌తో అధికారులు

సీలేరు (విశాఖ): విద్యుత్‌ ఉత్పత్తిలో దేశానికే తలమానికంగా నిలిచిన సీలేరు విద్యుత్‌ కాంప్లెక్స్‌ పరిధిలోని పలు జలవిద్యుత్‌ కేంద్రాలను జెన్‌కో మేనేజింగ్‌ డైరెక్టర్‌ డి.శ్రీధర్‌ శనివారం సాయంత్రం సందర్శించారు. తొలుత మోతుగూడెం జలవిద్యుత్‌ కేంద్రాన్ని పరిశీలించి.. అక్కడే మరో రెండు యూనిట్ల నిర్మాణానికి సంబంధించిన ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం 20 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే డొంకరాయి జలవిద్యుత్‌ కేంద్రాన్ని సందర్శించారు. దీనిని ఆనుకుని ఉన్న రిజర్వాయర్‌ వద్దకు వెళ్లి నీటి మట్టాలను పరిశీలించారు. డొంకరాయి, మోతుగూడెం విద్యుత్‌ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఇంజనీర్లు.. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి బదిలీ ప్రక్రియ చేపట్టాలని కోరారు. త్వరలో బదిలీల ప్రక్రియ చేపడతామని ఆయన హామీ ఇచ్చారని ఇంజనీర్లు తెలిపారు. 

నేడు సీలేరు, బలిమెల పర్యటన..
సీలేరు విద్యుత్‌ కాంప్లెక్సులో మొదటిరోజు పర్యటించిన జెన్‌కో మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ ఆదివారం సీలేరు జలవిద్యుత్‌ కేంద్రం, గుంటవాడ,  బలిమెల జలాశయాలను సందర్శించనున్నట్లు తెలిసింది. అలాగే సీలేరు ఎత్తిపోతల పధకానికి సంబంధించిన ప్రదేశాన్ని పరిశీలించి ఒడిశాలో ఏపీ పవర్‌హౌస్‌ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై స్థానిక అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. చీఫ్‌ ఇంజనీర్‌ (హెచ్‌పీసీ) సుజికుమార్‌తో పాటు సీలేరు కాంప్లెక్స్‌ చీఫ్‌ ఇంజనీర్‌ రాంబాబు, ఎస్‌ఈ ప్రశాంత్‌కుమార్, డీఈ బాలకృష్ణ, బాబురావు, తదితరులున్నారు.  

మరిన్ని వార్తలు