మనస్థాపంతో బాలిక ఆత్మహత్య

26 Apr, 2021 12:15 IST|Sakshi
సుష్మశ్రీ మృతదేహం   

నెల్లూరు రూరల్‌: సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడుతుందని తల్లిదండ్రులు మందలించారనే కారణంతో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెల్లూరురూరల్‌ పరిధిలోని నరుకూరు సెంటర్‌లో ఆదివారం జరిగింది. నెల్లూరు రూరల్‌ పోలీసుల కథనం మేరకు.. నరుకూరు సెంటర్‌లో నివాసం ఉంటున్న యదపర్తి మల్లికార్జున్, శైలజ దంపతుల కుమార్తె  సుష్మశ్రీ (16) 8వ తరగతి వరకు చదువుకుని ఏడాది నుంచి ఇంటి వద్దనే ఉంటుంది. కొంత కాలంగా సుష్మ సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడుతుండగా తల్లిదండ్రులు మందలిస్తున్నారు.

ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం కూడా సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడుతుండగా తల్లి శైలజ గమనించి సెల్‌ఫోన్‌ తీసుకుని మందలించింది. అదే సెంటర్లో వీరు టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. తల్లి టిఫిన్‌ సెంటర్‌కు వెళ్లిన ఆనంతరం రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లోని వంట గదికి ఉన్న ఇనుప రాడ్లకు తన చున్నీతో ఉరేసుకుంది. పక్కింటి వారు గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సుష్మను కిందకు దింపి నగరంలోని చింతారెడ్డిపాళెంలో ఉన్న మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నెల్లూరు రూరల్‌ పోలీసులకు సమాచారం అందడంతో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: కంటతడి పెట్టించిన హృదయ విదారక దృశ్యం..    
విషాదం: మృత్యువులోనూ సహచర్యం..

మరిన్ని వార్తలు