ప్రేమవివాహం: పెళ్లికొడుకు ఇంటికి నిప్పు

1 Feb, 2021 08:11 IST|Sakshi

గుంతకల్లు /అనంత‌: పెద్దలను కాదని ప్రేమ వివాహం చేసుకున్నారన్న ఆక్రోశంతో పెళ్లికొడుకు ఇంటికి పెళ్లికూతురు బంధువులు నిప్పంటించిన ఘటన నాగసముద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వెంకటాంపల్లికి చెందిన బోయ మల్లికార్జున కూతురు సుమిత్ర గ్రామ వలంటీర్‌గా పనిచేస్తోంది. నాగసముద్రం గ్రామానికి చెందిన నాగప్ప కుమారుడు హేమంత్‌ ఇంటర్‌ వరకూ చదివి వ్యవసాయం చేసుకుంటున్నాడు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. రెండు రోజుల క్రితం వీరిద్దరూ ఇళ్ల నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆదివారం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో హాజరయ్యారు. వీరిద్దరూ మేజర్లు కావడంతో తల్లిదండ్రులను పిలిపించి సర్దిచెప్పి పంపించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో వారిని తమ ఇంట్లో పెట్టుకుంటే సమస్యలు వస్తాయని భావించిన పెళ్లికొడుకు తల్లిదండ్రులు నూతన వధూవరులను బంధువుల ఇంటికి పంపించారు. ఈ క్రమంలో పెళ్లికూతురు సుమిత్ర తరఫు బంధువులు కొందరు ఆదివారం సాయంత్రం నాగసముద్రంలోని పెళ్లికొడుకు హేమంత్‌ ఇంటిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. చుట్టుపక్కల వారు మంటలు ఆర్పివేయడంతోపాటు ఈ ఘటనకు పాల్పడ్డ వారిని మందలించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే గ్రామానికి చేరుకున్న పోలీసులు నిప్పంటించిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు