ఇంద్రకీలాద్రి: 4 గంటల నుంచే అమ్మవారి దర్శనం

31 Aug, 2021 22:28 IST|Sakshi

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై అక్టోబర్‌ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శన వేళలను ఆలయ వైదిక కమిటీ ఖరారు చేసింది. ఉత్సవాలలో ప్రతి రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది.  

తొలి రోజైన 7వ తేదీన అమ్మవారికి స్నపనాభిషేకం స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అలంకారం నేపథ్యంలో ఉదయం 9 గంటలకు దర్శనం ప్రారంభం అవుతుందని వైదిక కమిటీ పేర్కొంది.  
► ఇక 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి రోజు తెల్లవారుజామున 4 గంటలకే దర్శనం ప్రారంభం అవుతుంది.  
► 11వ తేదీ సోమవారం అమ్మవారిని అన్నపూర్ణాదేవి, మహాలక్ష్మీగా అలంకరిస్తారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల వరకు దర్శనం నిలిపివేస్తారు. రెండు గంటలకు అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరించిన అనంతరం దర్శనాలు ప్రారంభమవుతాయి.  
► ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో రోజుకు ఎంత మంది భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించాలనే దానిపై సృష్టత లేదని తెలుస్తుంది. త్వరలోనే జరగబోయే జిల్లా అధికారుల రివ్యూ మీటింగ్‌లో దీనిపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు.  
► 12వ తేదీ మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలను సమర్పించనున్నారని పేర్కొన్నారు.

చదవండి: వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌లో ఏపీ మరో రికార్డు

మరిన్ని వార్తలు