వేగంగా టిడ్కో ఇళ్ల పంపిణీ

30 Jul, 2022 10:22 IST|Sakshi

కృష్ణా (మచిలీపట్నం): పేదల సొంతింటి కల సాకారం అయ్యే తరుణం ఆసన్నమైంది. టిడ్కో గృహాలకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. రిజి్రస్టేషన్‌ పూర్తయితే ఇంటిపై సర్వ హక్కులు పొందినట్లేనని అధికారులు చెప్పటంతో లబ్ధిదారుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు సబ్‌ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు టిడ్కో గృహ లబ్ధిదారులతో ప్రస్తుతం సందడిగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రంగం దీనిపై దృష్టి పెట్టింది. కలెక్టర్‌ రంజిత్‌ బాషా.. మున్సిపల్, టిడ్కో, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో దీనిపై తరచూ సమీక్షించి దిశానిర్దేశం చేస్తున్నారు.   

కృష్ణాలో 13,712 ఇళ్లు..   
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓటర్లను ప్రలోభపెట్టే క్రమంలో టిడ్కో ఇళ్ల పేరుతో హంగామా చేసి, నాటి పాలకులు నిర్మాణాలను అర్ధాంతరంగా వదిలేశారు. పేదలైన లబి్ధదారులకు మేలు చేకూర్చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి టిడ్కో గృహాలను పూర్తి చేసి ఇవ్వాలని ఆదేశించారు. మచిలీపట్నంలో 2,304, గుడివాడలో 8,912, ఉయ్యూరులో 2,496 కలిపి మొత్తం జిల్లాలో 13,712 గృహాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 90 శాతం ఇళ్లు పూర్తయ్యాయి. 365 ఎస్‌ఎఫ్‌టీ విస్తీర్ణం గల గృహానికి రూ. 3.15 లక్షలు, 430 ఎస్‌ఎఫ్‌టీ గృహాలకు రూ.3.65 లక్షలు రుణం మంజూరు చేయాలని ప్రభుత్వం బ్యాంకులకు నిర్దేశించింది. ఇందుకు రిజి్రస్టేషన్లు అవసరం దృష్ట్యా, యుద్ధ ప్రాతిపదికన వీటిని పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.  

రిజిస్టేషన్లకు ప్రత్యేక కౌంటర్లు.. 
టిడ్కో గృహాలను లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్  చేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసింది. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో భాగంగా లబ్ధిదారులకు సంబంధించిన సమగ్ర వివరాలతో కార్పొరేషన్, మునిసిపాలిటీల అధికారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తున్నారు. అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు జత చేసిన దరఖాస్తులు వస్తుండటంతో సకాలంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసేలా రిజిస్టర్ కార్యాలయంలో తగిన ఏర్పాట్లు చేశారు. రెగ్యులర్‌ రిరిజిస్ట్రేషన్ తో ఆటంకం లేకుండా టిడ్కో గృహ లబ్ధిదారుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మచిలీపట్నం, గుడివాడ సబ్‌ రిజి్రస్టార్ల పరిధిలో ఇప్పటికే రిజి్రస్టేషన్లు ప్రారంభమయ్యాయి. ఉయ్యూరులో సోమవారం నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.  

గృహ సముదాయాల్లో సకల హంగులు.. 
కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు మునిసిపాలిటీ పరిధిలో టిడ్కో ఆధ్వర్యంలో చేపట్టిన 13,712 ఇళ్లు నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చాయి. డిసెంబర్‌ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలనే లక్ష్యంగా టిడ్కో జిల్లా ప్రాజెక్టు అధికారి చిన్నోడు నేతృత్వంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. గృహ సముదాయాల వద్ద మౌలిక సౌకర్యాల కల్పనపై దృష్టి సారించారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరులలో నిర్మిస్తున్న గృహ సముదాయాల వద్ద మొత్తం రూ. 139.29 కోట్లతో రహదారులు, అండర్‌ గ్రౌం డ్రైనేజీల నిర్మాణం, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా వంటి మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నారు.

 

సకాలంలో రిజిస్ట్రేషన్‌.. 
టిడ్కో గృహ లబి్ధదారులకు సకాలంలో రిజిస్ట్రేషన్ చేసేందుకు శ్రద్ధ తీసుకున్నాం. కలెక్టర్‌ రంజిత్‌ బాషా ఆదేశాల మేరకు మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరులో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశాం. లబి్ధదారుల వివరాలతో మున్సిపల్‌ అధికారులు దరఖాస్తు చేస్తే, ఎటువంటి ఆలస్యం లేకుండా రిజి్రస్టేషన్‌ చేస్తున్నాం. లబి్ధదారుల్లో వృద్ధులు కూడా ఉన్నందున వారికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశాం. 
– టి. ఉపేంద్రరావు, జిల్లా రిజి్రస్టార్, కృష్ణా జిల్లా  

మరిన్ని వార్తలు