కళకళలాడుతున్న బోధనాస్పత్రులు..

8 Sep, 2020 08:33 IST|Sakshi

ఓ వైపు నియామకాలు.. మరోవైపు పదోన్నతులు

సాక్షి, అమరావతి: ఓ వైపు నియామకాలు.. మరోవైపు పదోన్నతులతో బోధనాసుపత్రులు కళకళలాడుతున్నాయి. గత పదేళ్లుగా వైద్యులకు న్యాయబద్ధంగా రావాల్సిన పదోన్నతులను, ఖాళీగా ఉన్న వందలాది వైద్య పోస్టులను ప్రస్తుత ప్రభుత్వం భర్తీ చేసింది. దీంతో గత పది రోజులుగా బోధనాసుపత్రుల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వైద్యులు పదోన్నతులతో, కొత్తగా వచ్చిన యువ వైద్యులూ విధుల్లో చేరుతున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంస్కరణల్లో భాగంగా ఉన్నతస్థాయి కమిటీని వేయడం, రాష్ట్రవ్యాప్తంగా ఆ కమిటీ పర్యటించి నివేదిక ఇవ్వడం.. దీని ఆధారంగా పోస్టులను భర్తీ చేయడం వంటివన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఏళ్లతరబడి డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్స్‌ కమిటీ నిర్వహించకుండా, పదోన్నతులు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించడంతో వైద్యులు ఒకే పోస్టులో దశాబ్దాల తరబడి ఉండిపోవాల్సి వచ్చిందని వైద్యులు వాపోయారు. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు బయటపడ్డామన్నారు.

ఇవీ మార్పులు..
నాడు–నేడు పనులకు సంబంధించి 11 బోధనాసుపత్రుల్లో కన్సల్టెన్సీల నియామకం
కొత్తగా 665 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల నియామకం పూర్తి
ఒకేసారి 89 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్‌లకు ప్రొఫెసర్‌లుగా పదోన్నతి
అడిషనల్‌ డైరెక్టర్‌ల పదోన్నతులు పూర్తి చేసి ఏడుగురికి ఆర్డర్లు
మరో వందమందికి పైగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లకు అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించేందుకు కసరత్తు
స్టాఫ్‌నర్సులు, ఫార్మసిస్ట్‌లు, ల్యాబ్‌టెక్నీషియన్లను జిల్లాల వారీగా నియామకం
ఒక్క ఏడాదిలోనే 56 పీజీ వైద్య సీట్లు పెంపు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో బోధనాసుపత్రుల్లో 1,170 మంది మెడికల్‌ ఆఫీసర్ల నియామకం. 

>
మరిన్ని వార్తలు