పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన సీఎం

1 Nov, 2020 09:00 IST|Sakshi
నేడు ఘనంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఉదయం 9.00 గంటలకు తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీస్‌లో జరిగే కార్యక్రమానికి హాజరై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు ‘మా తెలుగు తల్లికి’ గీతాలాపన అనంతరం జాతీయ పతాకం ఎగురేశారు. అనంతరం తెలుగు తల్లికి, అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక ఆయా జిల్లాల్లో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జిల్లా మంత్రులు అందుబాటులో లేకపోతే జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రులు ఆయా జిల్లాల్లో జాతీయ జెండా ఎగరేశారు. 

ప్రజల ఆనందకర జీవనమే ప్రభుత్వానికి విజయసూచిక -గవర్నర్‌ విశ్వభూషణ్‌
సాక్షి, అమరావతి: ప్రజల ఆనందకర జీవనమే ఏ ప్రభుత్వానికైనా విజయసూచికని.. ఆ మేరకు పాలన సాగాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆకాంక్షించారు. అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోంది. ప్రజలే ప్రాధాన్యతగా అమలు చేస్తున్న విధానాలను ప్రభుత్వం కొనసాగించాలి.  సామాన్యుల కలలను సాకారం చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని తన సందేశంలో గవర్నర్‌ పేర్కొన్నారు.   (సీఎం జగన్‌ చరిత్రలో నిలిచిపోతారు)

అంకితభావం, నిబద్ధతతో ముందుకెళదాం
ప్రజలకు సీఎం జగన్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: నేడు (నవంబర్‌ 1) రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. ‘పొట్టి శ్రీరాములుతోపాటు ఇతర స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు ఎంతగానో ప్రేరేపింపజేస్తున్నాయి. మహానుభావుల త్యాగాలను మననం చేసుకుంటూ.. వారిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం మనమంతా అంకితభావం, నిబద్ధతతో ముందుకెళదాం’ అని సీఎం పేర్కొన్నారు.

తాడేపల్లి : వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  సజ్జల రామకృష్ణ రెడ్డి కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పార్టీ పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి,  ప్రభుత్వ విప్ సామినేని ఉదయ భాను,  ఎమ్మెల్యేలు జోగి రమేష్, వసంత  కృష్ణ ప్రసాద్, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ అవినాష్, నగర్ అధ్యక్షుడు భవ కుమార్, కార్యాలయ ఇంచార్జ్ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

>
మరిన్ని వార్తలు