అదృశ్య శత్రువుపై సమష్టి యుద్ధం చేద్దాం 

21 Apr, 2021 03:27 IST|Sakshi
మాట్లాడుతున్న గవర్నర్‌ హరిచందన్‌. చిత్రంలో మంత్రి ఆదిమూలపు సురేష్,తదితరులు

వర్సిటీల వీసీలతో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ 

సాక్షి, అమరావతి: సమష్టిగా యుద్ధం చేసి కరోనా గొలుసును విచ్చిన్నం చేసేందుకు అందరం ఉద్యుక్తులం కావాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఉద్బోధించారు. విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్లతో విజయవాడ రాజ్‌భవన్‌ నుంచి మంగళవారం వెబినార్‌ ద్వారా నిర్వహించిన  సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండో విడత కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు.

విద్యార్థులు అటు తమ కుటుంబాలకు ఇటు సమాజానికి దూతలుగా వ్యవహరించాలని సూచించారు. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ బృందాల సహకారం తీసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి రెడ్‌క్రాస్‌ మొబైల్‌ యాప్‌ను ఉపయోగించి ప్రచారం చేపట్టాలని పిలుపునిచ్చారు. కరోనాపై పోరాటంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రంలో మూడు వర్సిటీలు, ప్రతి జిల్లాలో 10 కళాశాలలను ఎంపిక చేస్తామని గవర్నర్‌ చెప్పారు. అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యేలా వీసీలు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కోరారు.   

మరిన్ని వార్తలు