విద్యాసంక్షేమం సఫలం.. దొరబిడ్డల్లా పేద పిల్లలు

27 May, 2022 13:07 IST|Sakshi

2021–22లో అర్హులందరికీ పథకాలు

రూపురేఖలు మారిన ప్రభుత్వ పాఠశాలలు

పక్కాగా పథకాల అమలు 

ఏటా పెరుగుతున్న ప్రవేశాలు   

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రభుత్వ బడులను బలోపేతం చేయడంతో పాటు పేదలందరికీ ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌ విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టారు. విద్యా కానుక, ఇంగ్లిష్‌ మీడియం చదువులు, నాడు–నేడు, గోరుముద్ద, అమ్మఒడి తదితర పథకాలను ప్రణాళికాబద్ధంగా అమలుచేస్తున్నారు. 2021–22 విద్యాసంవత్సరంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో విద్యా సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలుచేశారు. 

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2021–22లో సంక్షేమ కార్యక్రమాలను సంపూర్ణంగా అందించి ఈ ఏడాది అక్షర యజ్ఞాన్ని విజయవంతంగా ముగించారు. ప్రభుత్వ విద్యారంగంపై సీఎం జగన్‌ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ, చిత్తశుద్ధిని చూసిన తల్లిదండ్రులు తమ బిడ్డలను కాన్వెంట్లలో మాన్పించి ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు. దీంతో మూడేళ్లుగా జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జిల్లా అధికారులు పథకాలన్నింటినీ ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నందున అమ్మఒడి పథకాన్ని విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత అమలుచేయనున్నారు. ఈ ఏడాది విద్యార్థుల హాజరు శాతానికి సంబంధించిన నివేదికలను ఉన్న తాధికారులకు పంపించారు.

 

దొరబిడ్డల్లా పేద పిల్లలు  
ప్రభుత్వం విద్యాకానుక కింద యూనిఫాం, నోట్‌ పుస్తకాలు, బూట్లు, టై, బెల్టులు, డిక్షనరీలు, స్కూల్‌ బ్యాగులు అందిస్తోంది. 2021–22లో మొత్తంగా నోట్‌ పుస్తకాలు 1,840,218, బెల్టులు, 2,53,530, స్కూల్‌ బ్యాగులు 3,39,273, బూట్లు 3,36,424, యూనిఫాం 3,42,494, డిక్షనరీలను 3,42,494 విద్యార్థులను అందజేశారు.  

కార్పొరేట్‌ హంగులతో.. 
మనబడి నాడు–నేడు పథకంలో పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కార్పొరేట్‌కు దీటుగా అధునాతన వసతులతో ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నారు. దీంతో పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. పక్కాగా ప్రహరీలతో పాఠశాలలకు రక్షణ ఏర్పాట్లు చేశారు. అందమైన బొమ్మలతో పాఠశాల ఆవరణ, తరగతి గదులను తీర్చిదిద్దారు. విద్యా సంస్కరణలతో ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. సీఎం జగన్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏటా విద్యార్థుల నమో దు శాతం క్రమంగా పెరుగుతోంది.

రాష్ట్రంలో అక్షర యజ్ఞం  
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో అక్షర యజ్ఞం కొనసాగుతోంది. రెండు విడతలు అమ్మఒడి పథకం అమలుచేయగా మూడో విడత ల్యాప్‌టాప్‌లు, నగదు ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు. త్వరలో రెండో విడత నాడు–నేడు పనులు చేపట్టనున్నారు. సర్కారీ బడుల్లో ఉన్నత కుటుంబాల విద్యార్థులు కూడా చేరే రోజు వస్తుంది. 
– జీజేఏ స్టీవెన్, వైఎస్సార్‌ టీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి 


ప్రణాళికాబద్ధంగా ముందుకు.. 

విద్యారంగ పథకాలను నిర్ణీత సమయంలో అమలు చేస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ప థకాల అమలుకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నాం. అర్హులందరికీ పథకాలు అందేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నాడు–నేడు ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసిన అంశం చరిత్రలో నిలిచిపోతుంది. 
– పి.శ్యామ్‌సుందర్, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్‌ 

నాడు–నేడు పనులు   
తొలివిడతలో 1,176 పాఠశాలలను ఎంపిక చేసి రూ.242.70 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇప్పటివరకూ 1,076 పాఠశాలల్లో రూ.226.48 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి.    రెండో విడతలో 892 పాఠశాలలను ఎంపిక చేసి రూ.292.18 కోట్ల నిధులు కేటాయించారు. 

మరిన్ని వార్తలు