అక్టోబర్‌ 31 వరకు ధాన్యం కొనుగోళ్లు

20 Sep, 2020 05:09 IST|Sakshi
ధాన్యం కొనుగోలుకు సమయం పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖ

సాక్షి, అమరావతి: పండించిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసేందుకు వీలుగా నెల్లూరు జిల్లా రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తడిసిన ధాన్యంతో పాటు మిగిలిన ధాన్యం సేకరించేందుకు అక్టోబర్‌ 31వ తేదీ వరకు కేంద్రం అనుమతి ఇచ్చింది. తడిచిన ధాన్యం పరిశీలనకు కేంద్ర  పౌరసరఫరాలశాఖ అధికారులు ఎం.జెడ్‌.ఖాన్‌(పాట్నా), యతేంద్ర జైన్‌(పూనా) ఈనెల 21న రాష్ట్రానికి రానున్నారు. నెల్లూరు జిల్లాలో మొత్తం 82 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. నాట్లు ఆలస్యంగా వేయడం, వర్షాలు అధికంగా రావడం వల్ల చాలా వరకు ధాన్యం తడిచిపోయింది.
రాష్ట్ర ప్రభుత్వం లేఖకు స్పందించి అనుమతులు ఇస్తూ కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి రాసిన లేఖ 

ఇందులో ఎన్‌ఎల్‌ఆర్‌– 3354 రకం ధాన్యం ఎక్కువగా తడిచిపోయింది. తడిచిన, మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అక్టోబర్‌ 31వ తేదీ వరకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌరసరఫరాల శాఖ ఎక్స్‌ అఫిషియో కార్యదర్శి కోన శశిధర్‌ కేంద్రానికి లేఖ రాశారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి కేంద్ర ఆహార శాఖ మంత్రిపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన కేంద్రం శుక్రవారం అనుమతులు జారీ చేసింది.

ప్రతి గింజా కొనుగోలు చేస్తాం 
రైతుల నుంచి ప్రతి గింజా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. తడిచిన, మిగిలిన ధాన్యాన్ని అక్టోబర్‌ 31లోగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తాం. దళారులను ఆశ్రయించి రైతులు మోసపోవద్దు.
– కోన శశిధర్, ఎక్స్‌ అఫిషియో కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ 

మరిన్ని వార్తలు