బూడిదతో గాంధీ బొమ్మ.. లిమ్కా బుక్‌లో కర్నూలు కుర్రాడు

29 Jan, 2021 09:25 IST|Sakshi

అత్యుత్తమ కళగా గుర్తించిన ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ 

జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆదోని యువకుడు

ఆదోని: బూడిదతో బాపూ బొమ్మను అత్యంత సహజంగా చిత్రీకరించిన ఆదోని యువకుడికి అరుదైన గౌరవం దక్కింది. అతని ప్రతిభను అత్యుత్తమంగా గుర్తించిన ముంబై ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ 2021 రికార్డుల జాబితాలో చోటు కల్పించింది. కరోనా నిబంధనలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో గోల్డ్‌ మెడల్, ప్రశంసా పత్రాన్ని కొరియర్‌లో పంపి సత్కరించింది. ఆదోని పట్టణం, నారాయణ గుంతకు చెందిన లక్ష్మీ, పద్మనాభం దంపతుల రెండో సంతానం శ్రీకాంత్‌ ఎంబీఏ పూర్తి చేసి చెన్నైలో ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పని చేస్తున్నారు.

కళాఖండాలను సృష్టించడం ప్రవృత్తిగా పెట్టుకున్నారు. తాజాగా ఈ నెల 4న కాగితాన్ని కాల్చగా వచ్చిన బూడిదలో తన చేతి మునివేళ్లను అద్ది తెల్ల కాగితంపై బాపూ (మహాత్మా గాంధీ) బొమ్మను అపురూపంగా తీర్చిదిద్దారు. కాగితం కాల్చి బూడిద చేయడం నుంచి బొమ్మ పూర్తిగా చిత్రీకరించే వరకు వీడియో రికార్డు చేసి ఇండియా  బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థకు పంపారు. రికార్డును పరిశీలించిన ఆ సంస్థ ప్యానల్‌ కమిటీ 2021– 22లో అత్యుత్తమ ఆర్ట్‌గా గుర్తించింది. అతన్ని గౌరవిస్తూ కరోనా నిబంధనల దృష్ట్యా గోల్డ్‌ మెడల్, ప్రశంసా పత్రాన్ని కొరియర్‌లో పంపింది. బుధవారం రాత్రి కొరియర్‌ అందుకున్న శ్రీవైష్ణవ శ్రీకాంత్‌ మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. తాను సరికొత్త ప్రయోగంతో చిత్రీకరించిన బాపు బొమ్మ జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చిపెట్టడం ఆనందం కలిగించిందన్నాడు.

మరిన్ని వార్తలు