గ్రూప్‌–1 దరఖాస్తు గడువు 5 వరకు పొడిగింపు

3 Nov, 2022 05:00 IST|Sakshi

ఏపీపీఎస్సీ ప్రకటన

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రూప్‌–1 కేడర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును నవంబర్‌ 5వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని గ్రూప్‌–1 కేడర్‌లోని 92 పోస్టులకు నియామక ప్రక్రియ కోసం ఏపీపీఎస్సీ సెప్టెంబర్‌ 30న నోటిఫికేషన్‌ జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు నిర్వహించే పరీక్షల కోసం అక్టోబర్‌ 13 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది.

దరఖాస్తుల స్వీకరణకు నవంబర్‌ 2వ తేదీతో(బుధవారంతో) గడువు ముగిసింది. అయితే గడువు పొడిగించాలని నిరుద్యోగ అభ్యర్థుల నుంచి వందలాదిగా ఏపీపీఎస్సీకి అభ్యర్థనలు అందడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఏపీపీఎస్సీ చైర్మన్‌ డి.గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. సంబంధిత ఫీజును 4వ తేదీ రాత్రి 11.59లోపు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.  

డిసెంబర్‌ 18న ప్రిలిమ్స్‌  
గ్రూప్‌–1 పోస్టుల నియామకాలకు సంబంధించి ప్రిలిమినరీ(స్క్రీనింగ్‌ టెస్టు)ని డిసెంబర్‌ 18న నిర్వహిస్తున్నట్టు ఏపీపీఎస్సీ చైర్మన్‌ తెలిపారు. దరఖాస్తు గడువు పొడిగించినా పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. మెయిన్స్‌ పరీక్షలను మార్చి రెండో వారం తర్వాత చేపడతామని వెల్లడించారు.  

మరిన్ని వార్తలు