బాబు డీలా.. కుప్పంలో ఎలా? 

29 Oct, 2020 08:50 IST|Sakshi
కుప్పంలో శరవేగంగా పూర్తయిన రైల్వే అండర్‌ బ్రిడ్జి

నియోజకవర్గంలో వేగంగా అభివృద్ధి పనులు 

అడ్డుకునేందుకు టీడీపీ నేతల తంటాలు 

వైఎస్సార్‌సీపీలోకి పెరుగుతున్న వలసలు 

దిక్కుతోచక ఎల్లో బ్యాచ్‌ డ్రామాలు 

అధికారంలో ఉన్నప్పుడు ఎదురులేదని విర్రవీగారు.. ఎంతో అభివృద్ధి చేశామని జబ్బలు చరుచుకున్నారు.. కుప్పం నియోజకవర్గం తమ దుర్భేద్య దుర్గమని గొప్పలు చెప్పుకున్నారు.. కోటకు బీటలు వారే సరికి బిక్కమొహం వేస్తున్నారు.. క్షేత్ర స్థాయిలో ప్రజలకు చేసింది శూన్యమని అర్థం కావడంతో డ్రామాలకు తెరదీస్తున్నారు.. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పూర్తయితే టీడీపీ కథ కంచికి చేరినట్టే అని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.. చంద్రబాబు నిర్లక్ష్యంతో ఆగిన ప్రగతిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేగవంతం చేశారని వెల్లడిస్తున్నారు. రాబోయే రోజుల్లో కుప్పం కోటపై వైఎస్సార్‌సీపీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. 

సాక్షి, తిరుపతి: కుప్పం నియోజకవర్గలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకోవడంతో చంద్రబాబులో సైతం ఆందోళన మొదలైంది. దీనికితోడు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న వన్నెకుల క్షత్రియులకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడంతోపాటు స్థానిక మహిళ వనితకు చైర్‌పర్సన్‌ పదవిని ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కట్టబెట్టారు. ఈ క్రమంలో కార్యకర్తల దృష్టి మరల్చేందుకు చంద్రబాబు వేస్తున్న ఎత్తులను ఆ పార్టీ వారే విమర్శిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని గుసగుసలాడుకుంటున్నారు. ఆయన నిర్లక్ష్య వైఖరితోనే జిల్లాలో టీడీపీ ఒక్క సీటుకే పరిమితమైందని తేల్చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేయడం తగదని హితవు పలుకుతున్నారు. ప్రజలు వాస్తవాలు గుర్తించారని, తమ మాయమాటలు నమ్మరని తెలియడంతో బాబుకు కునుకు కరువైందని బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. (చదవండి: పేదల ద్రోహి చంద్రబాబు

కుప్పంపై ప్రత్యేక శ్రద్ధ 
కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు. అందులో భాగంగా విధి నిర్వహణలో అలసత్వం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు డీఈలను సైతం సస్పెండ్‌ చేశారు. ఈ క్రమంలోనే హంద్రీ–నీవా సుజల స్రవంతిలో భాగంగా పుంగనూరు, కుప్పం బ్రాంచ్‌ కెనాల్స్‌పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. కుప్పంలో సుమారు 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే అండర్‌ బ్రిడ్జి పనులు కూడా పూర్తి కావచ్చాయి. దళవాయిపల్లె వద్ద మరో అండర్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. మరోవైపు కల్లివంక ప్రాజెక్టు పనులు కూడా పూర్తయ్యాయి. నాలుగు చెరువుల్లోకి నీరు చేరి, తాగు, సాగునీటి సమస్యలు తీరాయి. (చదవండి: ఓడి ఇంట్లో కూర్చొని ఇదేం వాదన బాబూ!)

ఇదివరకు కుప్పం రూర్బన్‌ మిషన్‌ పేరుతో మంజూరైన రూ.14కోట్లను కేవలం కమీషన్లు ఇవ్వలేదనే కారణంతో బాబు అండ్‌ కో వినియోగించ లేదు. 30 ఏళ్ల పాటు నియోజకవర్గానికి ప్రాతిని«థ్యం వహించినా కుప్పం పట్టణాన్ని మున్సిపాలిటీగా చేయలేకపోయారు. ప్రస్తుతం వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం కుప్పం పట్టణాన్ని మున్సిపాలిటీ చేయడంతోపాటు గతంలో వినియోగించని రూ.14 కోట్లతో అండర్‌ డ్రైనేజీ పనులు చేపట్టింది. చంద్రబాబు హ యాంలో నిర్లక్ష్యానికి గురైన అనేక పనులను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి త్వరితగతిన పూర్తి చేయిస్తుండడంతో టీడీపీ వెన్నులో వణుకు మొదలైంది. భవిష్యత్‌లో కుప్పం కూడా వైఎస్సార్‌ సీపీ ఖాతాలోకే వెళ్లిపోతుందనే నిర్ణయానికి వచ్చింది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు నియోజకవర్గ అభివృద్ధిని జీరి్ణంచుకోలేని కొందరు నేతలతో డ్రామాలకు తెరతీస్తోంది. చంద్రబాబు దిశానిర్దేశంతో పాదయాత్ర పేరుతో చేపట్టిన నాటకాలకు ప్రజాస్పందన కరువైంది. కేవలం కొద్దిమంది పెయిడ్‌ ఆరి్టస్టులను వెంటేసుకుని హడావుడి చేస్తోంది.    

మరిన్ని వార్తలు