Gujarat Heroin Bust: ఆషి ట్రేడింగ్ కంపెనీ కార్యకలాపాలు ఏపీలో లేవు: డీజీపీ సవాంగ్‌

23 Sep, 2021 18:01 IST|Sakshi

సాక్షి, అమరావతి: విజయవాడ కేంద్రంగా ఎటువంటి డ్రగ్స్ సరఫరా జరగలేదని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని ముంద్రా పోర్టులో దొరికిన హెరాయిన్‌పై కొన్ని తప్పుడు వార్తలు ప్రచారమవుతున్నాయని, డ్రగ్స్‌తో ఏపీ రాష్ట్రానికి సంబంధం లేదని వెల్లడించారు. విజయవాడలో జీఎస్‌టీ అడ్రస్ మాత్రమే ఉందని, హెరాయిన్‌ను విజయవాడకు గానీ, ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రదేశాలకు కానీ దిగుమతి చేసుకున్నట్లు ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. ఆఫ్గనిస్తాన్ నుంచి ముంద్రా పోర్టుకు వేరే కన్‌సైన్‌మెంట్‌ ముసుగులో హెరాయిన్ దిగుమతి చేసుకొనే క్రమంలో పట్టుబడిందిగా మాత్రమే డీఆర్‌ఐ, కేంద్ర సంస్థల అధికారులు పేర్కొన్నట్లు తెలిపారు.
చదవండి: అక్రమ మద్యం తయారీపై ఉక్కుపాదం: సీఎం జగన్‌

అయితే కొంతమంది రాజకీయ నాయకులు డ్రగ్స్ వ్యవహారంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ తరహా తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. అన్ని అంశాలపై డీఆర్ఐ, కేంద్ర సంస్థలు ముమ్మరంగా పరిశోధన చేస్తున్నాయని డ్రగ్స్‌ వ్యవహారంలో డీఆర్‌ఐకి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సైతం దీనిపై తగిన ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. కాబట్టి, ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రకటనలు చేయడం, ప్రజల మనసుల్లో భయాందోళనలు రేకెత్తించడం, ప్రజలను తప్పు దోవ పట్టించడం మానుకోవాలని హితవు పలికారు.
చదవండి: ‘తల్లిదండ్రులను వేధించి ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు’

‘సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి, నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ప్రజాప్రతినిధుల మీద ఉందన్న విషయాన్ని మరిచిపోవడం బాధాకరం. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ముంద్రా పోర్ట్ లో డీఆర్‌ఐ అధికారులు హెరాయిన్ స్వాధీనం చేసుకున్న విషయం అందరికీ విదితమే. ఈ అంశంపై విజయవాడ కమిషనర్ ఇప్పటికే ప్రెస్ నోట్ విడుదల చేసి ఆ అంశానికీ,  విజయవాడకు లింక్ చేయడం సమంజసం కాదని చెప్పారు. అయినా రాజకీయ నాయకులు ఈ అంశాన్ని మరీమరీ  ప్రస్తావించడం సరికాదు. నేరం ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్‌లో లేవన్న విషయం అటు డీఆర్ఐ, కేంద్ర సంస్థలు,  ఇటు పత్రికలు ధృవీకరిస్తున్నా, సీనియర్ నాయకులు అపోహలు సృష్టించడం భావ్యం కాదు. ఆషి ట్రేడింగ్ కంపెనీ చిరునామా మాత్రమే విజయవాడగా ఉంది. వారి కార్యకలాపాలు ఇసుమంతైనా ఏపీలో లేవు’ అని డీజీపీ సవాంగ్‌ తెలిపారు.

చదవండి: ‘అమెరికన్‌ కార్నర్‌’ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

మరిన్ని వార్తలు