వికటించిన వ్యాక్సిన్‌.. ఆశ కార్యకర్త బ్రెయిన్‌ డెడ్‌! 

24 Jan, 2021 03:01 IST|Sakshi
అస్వస్థతకు గురైన లక్ష్మిని పరామర్శిస్తున్న  వైద్యాధికారులు

అస్వస్థతకు గురై కోలుకుంటున్న ఏఎన్‌ఎం

సాక్షి, గుంటూరు (మెడికల్‌): కోవిడ్‌ వ్యాక్సిన్‌ వికటించి ఆశ కార్యకర్తకు బ్రెయిన్‌ డెడ్‌ అయినట్టు సమాచారం అందగా.. మరో ఏఎన్‌ఎం అస్వస్థతకు గురై కోలుకుంటోంది. వివరాలివీ.. తాడేపల్లి పీహెచ్‌సీ పరిధిలోని ఆరోగ్య కార్యకర్త (ఏఎన్‌ఎం) గొట్టిముక్కల లక్ష్మి (38), ఆశ కార్యకర్త బొక్కా విజయలక్ష్మి (42)కి ఈ నెల 20న కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేశారు. తరువాత ఏఎన్‌ఎం లక్ష్మికి తలనొప్పి, ఫిట్స్‌ రాగా.. విజయలక్ష్మి తలనొప్పి, మగత, వాంతులు వంటి లక్షణాలతో స్పృహ కోల్పోయింది. దీంతో వారిద్దరినీ ఈ నెల 22న జీజీహెచ్‌లో చేర్చించారు. చదవండి: (వ్యాక్సిన్‌: ఆసుపత్రిలో అంగన్‌వాడీ టీచర్‌)

ఆందోళన వల్ల ఏఎన్‌ఎం లక్ష్మికి రియాక్షన్‌ వచ్చిందని, చికిత్స అందించిన వెంటనే సాధారణ స్థితికి చేరుకుని డిశ్చార్జి అయ్యేందుకు సిద్ధంగా ఉందని జీజీహెచ్‌ వైద్యులు తెలిపారు. ఆశ కార్యకర్త విజయలక్ష్మి బ్రెయిన్‌ స్టెమ్‌ స్ట్రోక్‌కు గురైనట్టు తేల్చారు. శనివారం రాత్రి ఆమెకు బ్రెయిన్‌ డెడ్‌ అయినట్టు సమాచారం. అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఇదిలావుండగా.. విజయలక్ష్మికి వేసిన వయల్‌ నుంచే మరో వైద్యుడికి టీకా వేసినా అతనికి ఎలాంటి రియాక్షన్‌ లేకపోవడం గమనార్హం. డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ చుక్కా రత్నమన్మోహన్‌ జీజీహెచ్‌కు చేరుకుని వారిద్దరి పరిస్థితిపై ఆరా తీశారు.

మరిన్ని వార్తలు