‘విభజన చట్టం ప్రకారమే కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌’

19 Jul, 2021 03:55 IST|Sakshi

మంగళగిరి: విభజన చట్టం ప్రకారమే నీటి ప్రాజక్టులపై కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకటించిందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు చెప్పారు. మంగళగిరిలోని చేనేత వస్త్ర దుకాణాలను ఆదివారం సందర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు.  రెండు రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డులు నిర్ణయాలు చేసే ముందు ట్రిబ్యునల్‌ ప్రతిపాదనకు అనుగుణంగానే పనిచేస్తాయన్నారు. ప్రాజెక్టులపై కేంద్ర పెత్తనం అన్నది అభూతకల్పనేనన్నారు.

నీటి వివాదాలకు అడ్డుకట్ట వేసేందుకే కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిందని, పార్టీలు రాజకీయ కారణాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయని విమర్శించారు. ప్రాజెక్టుల నిర్వహణ అనేది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంటుందని, కేంద్రం జోక్యం చేసుకోదన్నారు. కొత్త ప్రాజెక్టుల అనుమతులు కోసం అయినా, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు కావాలన్నా రెండు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర జలశక్తి మంత్రి చర్చించుకుని అనుమతులు పొందొచ్చని జీవీఎల్‌ వివరించారు.  

మరిన్ని వార్తలు