రైతుల సమస్యల పరిష్కారం కోసమే టాస్క్‌ఫోర్స్‌: జీవీఎల్‌

8 Oct, 2020 12:08 IST|Sakshi

సాక్షి, గుంటూరు: మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక టాస్క్‌ ఏర్పాటు చేశామని రాజ్యసభ సభ్యుడు, మిర్చి టాస్క్‌ ఫోర్స్‌ చైర్మన్‌ జీవిఎల్‌ నరసింహరావు తెలిపారు. గురువారం ఆయన గుంటూరు మిర్చి యార్డులో జరిగిన టాస్క్‌ ఫోర్స్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఎల్‌ మాట్లాడుతూ.. ఆరు నెలల కార్యచరణలో భాగంగా తొలి సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులు తమ సమస్యలను కమిటీ ముందు ప్రస్తావించవచ్చని తెలిపారు. కేంద్రం కొత్తగా తీసుకున్న నిర్ణయాలు, ఏపీలో ముందుగా అమలు చేయాలన్నది తన పక్షపాతంమని పేర్కొన్నారు. ఎందుకంటే తను గుంటూరు జిల్లా వాడినని గుర్తుచేశారు. రూ.7 వేల కోట్లతో పది వేల రైతు సంఘాలు ఏర్పాటు చేయాలన్నది కేంద్ర నిర్ణయమని వెల్లడించారు.

500 మంది రైతులు సంఘంగా ఏర్పడితే కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు రైతుల ఖాతాలోకి జమ అవుతాయని ఆయన చెప్పారు. ముందుగా రూ.25 లక్షలు, ఈక్విటీ రూపంలో మరో రూ.15 లక్షలను కేంద్రం ఆర్థిక సహాయం రూపంలో అందజేస్తుందని తెలిపారు. కేంద్రం తీసుకున్న వచ్చిన కొత్త చట్టాల వల్ల రైతులకు ఉపయోగకరమైన వాతావరణం కలిగిస్తుందని తెలిపారు. వాటిపై కొంతమంది తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో కనీసం 400, 500 రైతు కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రూ.లక్ష కోట్ల పెట్టుబడితో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఏపీకి రూ.6,500కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకి కలిపి రూ.10వేల కోట్లపైగా కేంద్రం నిధులు కేటాయించిందని తెలిపారు.

మరిన్ని వార్తలు