పోతేపోనీ.. రూ.35 లక్షలే కదా సర్‌.!!

1 Apr, 2022 11:37 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ‘‘ఏముంది సర్‌... రూ.35 లక్షలు పోతేపోనీ.. రూ.60 లక్షలు ఇస్తామంటున్నారు కదా.. తిరిగి వారికే ఇచ్చేద్దాం’’ డైమండ్‌ పార్క్‌ దరి తందూరీ ఇన్‌ హోటల్‌ లీజు వ్యవహారంపై జీవీఎంసీలో గురువారం రాత్రి జరిగిన చర్చ ఇదీ. వివరాల్లోకి వెళ్తే... జీవీఎంసీకి చెందిన షాపింగ్‌ కాంప్లెక్స్‌లో తందూరీ ఇన్‌ హోటల్‌ దాదాపు ఇరవై ఏళ్లుగా రూ.1.34 కోట్ల లీజు బకాయిలు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.39 లక్షలు మాత్రమే చెల్లించింది. మిగిలిన రూ.95 లక్షలు లీజు డబ్బులు చెల్లించాలని జీవీఎంసీ నోటీసులు అందించగా.. హోటల్‌ యజమానులు హైకోర్టుని ఆశ్రయించారు.

అయితే బకాయిలు పూర్తిగా చెల్లించాలని, అనంతరం వేలం వేయాలని కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై గురువారం రాత్రి జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రతిపక్ష కార్పొరేటర్లతోపాటు ఒకరిద్దరు అధికార పార్టీ కార్పొరేటర్లు సమావేశమైనట్లు సమాచారం. రూ.95 లక్షల్లో రూ.౩5 లక్షల వరకూ ఉన్న వడ్డీని మినహాయించాలని కొందరు కార్పొరేటర్లని సదరు యజమాని ఆశ్రయించినట్లు తెలిసింది. దీనిపై ఉన్నతాధికారులను ఒప్పించేందుకు ప్రతిపక్ష కార్పొరేటర్లు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. రూ.60 లక్షలు వస్తున్నప్పుడు రూ.35 లక్షలు వదిలేద్దామని అధికారులను ఒప్పించేందుకు ప్రయత్నాలు జోరుగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది.  

చదవండి: (ఫలించిన సమన్వయ మంత్రం.. శ్రీశైలంలో సడలిన ఉద్రిక్త పరిస్థితులు) 

మరిన్ని వార్తలు