రేణిగుంట: తుపాకీతో కాల్చుకుని హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

8 Aug, 2021 09:56 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: తిరుపతిలోని రేణిగుంటలో విషాదం చోటుచేసుకుంది. ఆర్‌పీఎఫ్‌ బ్యారక్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం తెల్లవారుజామున తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆనందరావు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. మృతుడు శ్రీకాకుళం జిల్లా చింతలపోలూరుకి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై రేణిగుంట సీఐ అంజూ యాదవ్‌ మాట్లాడుతూ.. శ్రీకాకుళానికి చెందిన హెచ్‌ ఆనందరావు అనే హెడ్‌ కానిస్టేబుల్‌ ఇటీవల సెలవులపై వెళ్లి ఆగష్టు 3న తిరిగి విధుల్లో చేరినట్లు తెలిపారు. అయితే ఈరోజు ఉదయం 3 గంటల సమయంలో ర్వేల్వే బ్యారక్‌ ఆర్మర్‌ గదిలోకూర్చీలో కూర్చొని తుపాకీతో కాల్చుకొని మరణించినట్లు వెల్లడించారు. నిన్న ఉదయం 6 గంటల నుంచి ఈరోజు ఉదయం 6 గంటల వరకు అతను విధుల్లో ఉండాల్సి ఉంది. ఉదయం 4 గంటలకు ఏఎస్సై రాజు పిస్తోల్‌ను డిపాజిట్‌ చేసేందుకు రాగా కానిస్టేబుల్‌ మరణించిన వార్త తెలిసిందన్నారు. దీనిపై విచారణ చేపట్టినట్టు తెలిపారు. ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ లభించలేదని అంజూ యాదవ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు