పీహెచ్‌సీల్లో టెలి మెడిసిన్‌ సదుపాయంతో అందరికీ వైద్యసేవలు: కృష్ణబాబు 

31 Aug, 2022 17:01 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. కానీ, కొన్ని పత్రికలు మాత్రం ప్రజలకు అందిస్తున్న వైద్యం విషయంలో తప్పుడు వార్తలు రాస్తూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో పీహెచ్‌సీల పని తీరుపై హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ కృష్ణబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 

అయితే, కృష్ణబాబు బుధవారం మీడియాతో​ మాట్లాడుతూ.. ‘ప్రతీ మండలంలో అందుబాటులోకి పీహెచ్‌సీలను తీసుకువచ్చాము. టెలి మెడిసిన్‌ సదుపాయంతో అందరికీ వైద్య సౌకర్యం అందుబాటులోకి తెచ్చాము. పీహెచ్‌సీలో అన్ని రకాల మందులు, పరికరాలు అందుబాటులో​ ఉంటాయి. పీహెచ్‌సీలో గర్భిణీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌తో వారిని క్షేమంగా ఇంటికి చేరవేస్తున్నాము. 

మూడేళ్లలో వైద్యారోగ్య శాఖలో 45వేల నియామకాలు జరిగాయి. అందులో 4500 వరకు డాక్టర్ల నియామకాలు కూడా జరిగాయి. ఇంకా వైద్యుల నియామకాలు కొనసాగుతున్నాయి. విలేజ్‌ హెల్త్‌​ క్లీనిక్స్‌ కూడా ఏర్పాటు చేస్తున్నాము. రెఫరల్‌ ఆసుపత్రుల్లో గైనకాలజిస్టు సహా అన్ని విభాగాల వైద్యులు ఉన్నారు. ప్రతీ పీహెస్‌సీలో కూడా మెడిసిన్స్‌ అందుబాటులో ఉన్నాయి. డాక్లర్లు లేరని కొన్ని పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. డాక్టర్లు ఉన్నప్పటికీ వారు లేరని పత్రికల్లో రాయడం సరికాదు. అన్ని చోట్ల వైద్యులు అందుబాటులో ఉన్నారు. స్పెషలిస్టులకు అన్ని రకాల ఇన్సెంటివ్‌లు ఇస్తున్నాము’ అని స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు