23న అల్పపీడనం.. 5 జిల్లాలపై ప్రభావం
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/సాక్షి, అమరావతి : ఏపీ తీర ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల వల్ల రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రా తీరం వెంబడి ఉత్తర కోస్తాలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
ఉత్తర కోస్తాంధ్రలో పలు చోట్ల ఈదురు గాలులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 23న వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావం ఒడిశా తీరంలో ఎక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఓ మోస్తరు ప్రభావం చూపనుంది. 22, 23వ తేదీల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని ఇప్పటికే హెచ్చరించారు.