వర్షాలు, సహాయక చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష

14 Oct, 2020 13:23 IST|Sakshi

 భారీ వర్షాలు-వరదలు, సహాయ కార్యక్రమాలపై సీఎం జగన్‌ సమీక్ష

అన్ని  జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

సహాయ చర్యలు మరింత ముమ్మరం చేయండి

శిబిరాల్లో ఉన్న వారికి రూ.500 చొప్పున ఇవ్వండి

వారు ఇళ్లకు తిరిగి వెళ్లాక ఇబ్బందులకు గురి కావొద్దు

వెంటనే అన్ని చోట్ల విద్యుత్‌ సరఫరాను పునరుద్దరించండి

చెరువులు, కాల్వల గండ్లు పూడ్చండి

రోడ్లపై గుంతలు పూడ్చి, అవసరమైన మరమ్మతులు చేయండి

సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం

సాక్షి, తాడేపల్లి: ఎడతెరిపి లేని వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్‌ తడిసిముద్దయింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భారీ వర్షాలు, సహాయక చర్యలపై బుధవారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించారు. మంత్రులు సుచరిత, బొత్స, సీఎస్‌ నీలంసాహ్ని కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్లు,అధికారులతో జిల్లాలవారీగా సీఎం సమీక్షించారు. 

ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. విద్యుత్‌ పునరుద్ధరణ యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సీఎం ఆదేశించారు. రోడ్ల పునరుద్ధరణ పనులు వేగంగా చేపట్టి వరద బాధితులకు సాయం చేయాలని అన్నారు. అదేసమయంలో వర్షాల వల్ల వచ్చే వ్యాధులపై దృష్టి పెట్టాలని సీఎం చెప్పారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి అవసరమైన సాయం అందించాలని అన్నారు. తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టాలన్న సీఎం వైఎస్‌ జగన్ ఆదేశించారు.
(చదవండి: చిగురుటాకులా వణికిన తీరం )

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష సమావేశంలోని ముఖ్యాంశాలు

ప్రకాశం బ్యారేజీకి భారీ వరద:

  • తెలంగాణలో భారీ వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వస్తోంది.
  • బ్యారేజీ వద్ద ఇప్పటికే భారీ వరద కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి 4 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మరో 24 గంటల్లో ఆ వరద చేరుతుంది.
  • ఏ పరిస్థితి అయినా ఎదుర్కోవడం కోసం గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి.
  • విజయవాడలో ఇళ్లు ఖాళీ చేయించే వారికి తప్పనిసరిగా వసతి కల్పించాలి. 
  • ప్రకాశం బ్యారేజీ వద్ద 7.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే వీలుంది, కాబట్టి ఆ మేరకు సిద్ధంగా ఉండండి.

విద్యుత్‌ పునరుద్ధరించాలి

  •  విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ చాలా ముఖ్యం, దాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టాలి.
  •  ఆ తర్వాత కాలువలు, చెరువుల గండ్లు పూడ్చడంతో పాటు, రహదారుల మరమ్మతు పనులు కూడా యుద్ధప్రాతిపదికన జరగాలి.
  • అన్ని చోట్లా రహదారులు బాగు చేసి, అందుబాటులోకి తేవాలి.
  • 4-5 నెలల్లో శాశ్వత ప్రాతిపదికన కూడా మరమ్మత్తులు పూర్తి చేయాలి.

ఆర్థిక సహాయం చేయాలి

  • వేర్వేరు జిల్లాలలో చనిపోయిన 10 మంది కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించండి.
  • అదే విధంగా వెంటనే నష్టం అంచనాలు వేయండి, వారం రోజుల్లో నష్టంపై అంచనాలు పంపండి.
  • తూర్పు గోదావరి జిల్లాలో ఏలేరు రిజర్వాయర్‌ వల్ల పిఠాపురంలో వరద వస్తోంది కాబట్టి, అవసరమైన ఆధునీకరణ చేపట్టండి. 
  • వర్షాలు తగ్గాయి కాబట్టి, ఇంకాస్త అప్రమత్తంగా ఉండండి.

నీటిని వృథాగా పోనీయొద్దు

  • రిజర్వాయర్లు నింపడం, అక్కడి నుంచి కాలువల ద్వారా ప్రతి చెరువు నింపడంపై రాయలసీమతో పాటు, శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి.
  • ఆ మేరకు ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధం చేయండి.
  • చిత్తూరు జిల్లాలో 40 శాతం అధిక వర్షాలు కురిసినా, కేవలం 30 శాతం మాత్రమే ట్యాంకులు నిండడం పరిస్థితికి అద్దం పడుతోంది.
  • దీన్ని పూర్తిగా మార్చి, కురిసే ప్రతి నీటి బొట్టుని ఒడిసి పట్టాలి,తద్వారా రిజర్వాయర్లు, చెరువులు నింపాలి.
  • కరువు నివారణలో శాశ్వత పరిష్కారం చూడాలి.
  • నెల్లూరు జిల్లాలో కండలేరులో ఈసారి గరిష్టంగా 60 టీఎంసీల నీరు నిల్వ చేయబోతున్నాం.
  • ఇప్పటి వరకు కండలేరులో గరిష్టంగా 50 టీఎంసీలు మాత్రమే నిల్వ చేశాం.

మానవతా దృక్పథం చూపండి

  • సహాయ శిబిరాల్లో (షెల్టర్లలో) ఉన్న వారి పట్ల పూర్తి మానవతా దృక్పథంతో వ్యవహరించండి,వారికి కనీసం రూ.500 చొప్పున ఇవ్వండి.
  • వారి ఇళ్లలో పరిస్థితి ఎలా ఉందో తెలియదు కాబట్టి, అన్నింటిని ఆరా తీసి ఆదుకోండి.

వ్యవసాయశాస్త్రవేత్తల సూచనలు: పూనం మాలకొండయ్య
కాగా, వరదలు తగ్గుముఖం పట్టాక వ్యవసాయ, ఉద్యానవన వర్సిటీలు, కృషి విజ్ఞాన కేంద్రాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవసరమైన సూచనలు చేస్తారని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య వెల్లడించారు. పంటల నష్టంపై వీలైనంత త్వరగా అంచనాలు పూర్తి చేసి పంపాలని ఆమె జిల్లాల కలెక్టర్లను కోరారు. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పటికీ ధాన్యం సేకరణ యథావిథిగా కొనసాగుతుందన్న ఆమె, ఆ మేరకు ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల వద్ద రిజిస్ట్రేషన్‌ కొనసాగుతోందని చెప్పారు.

పక్కాగా శానిటేషన్‌: గోపాలకృష్ణ ద్వివేదీ
వరదలు సంభవించిన అన్ని చోట్ల శానిటేషన్‌ కోసం తగిన ఏర్పాట్లు చేశామని, అన్ని చోట్ల అవసరమైన బ్లీచింగ్‌ పౌడర్‌ అందుబాటులో ఉంచామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ వెల్లడించారు. ఇప్పటికే అంతటా శానిటేషన్‌ చర్యలు మొదలయ్యాయన్న ఆయన, తాగు నీరు కూడా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు