మూడు రోజులు వానలే.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం

17 Mar, 2023 04:17 IST|Sakshi

18న ఉత్తర, దక్షిణ కోస్తాల్లో భారీ వర్షాలు 

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కొనసాగనున్నాయి. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్‌ తీరం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు బంగ్లాదేశ్‌ పరిసర ప్రాంతాల నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. వీటి ఫలితంగా శుక్ర, శని, ఆదివారాల్లో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వీలుంది.

శనివారం దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి నివేదికలో వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూ­రు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవవచ్చని తెలిపింది.

ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని పేర్కొంది. ఉరుములు, మెరుపులు, అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని, గంటకు 30నుంచి 40 కిలోమీటర్లు గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మూడు రోజులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేడ్కర్‌ కోరారు.  

మరిన్ని వార్తలు