విద్యార్థుల్లో పరిశోధనా నైపుణ్యం పెరగాలి

28 Aug, 2022 04:48 IST|Sakshi
మాట్లాడుతున్న హేమచంద్రారెడ్డి

ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి 

లబ్బీపేట(విజయవాడ తూర్పు): విద్యార్థుల్లో పరిశోధనా నైపుణ్యం పెరగాలి అని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి అన్నారు. ఆ దిశగా జాతీయ విద్యా విధానం ద్వారా కేంద్రం భారీ మార్పులు తీసుకువచ్చిందని చెప్పారు. శనివారం విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో ‘నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ–ఒక అంచనా’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగంలో మొత్తం 27 అంశాల్లో మార్పులు చేశారని చెప్పారు. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీని అమలు చేయడంలో ఏపీ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందన్నారు.

ప్రాక్టికల్స్‌తో కూడిన విద్యను ప్రతి ఒక్కరూ అభ్యసించేందుకు.. ఇంటర్న్‌షిప్స్‌ని తప్పనిసరి చేసినట్లు చెప్పారు. విద్యార్థుల్లో పరిశోధనా నైపుణ్యాలను పెంపొందించేందుకు.. రాష్ట్రంలో పలుచోట్ల రీసెర్చ్‌ బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నైపుణ్యంతో కూడిన విద్యను విద్యార్థులకు అందించడమే కొత్త విద్యా పాలసీ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. సదస్సులో కృష్ణా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్‌ వి.వెంకయ్య, ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఎడ్యుకేషన్‌ విభాగ ప్రొఫెసర్‌ అరబింద్‌ కుమార్, జానియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.కల్పన, డైరెక్టర్‌ విజయలక్ష్మి, సిద్ధార్థ అకాడమీ జాయింట్‌ సెక్రటరీ ఎన్‌.లలిత్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు