పీఎంపాలెం మాస్టర్ ప్లాన్ రోడ్డులో మూసివేసిన హెరిటేజ్ డిపార్టుమెంట్ స్టోర్
సాక్షి,పీఎంపాలెం (భీమిలి): హెరిటేజ్ సంస్థ మెంబర్ షిప్ల పేరుతో మోసానికి పాల్పడింది. హెరిటేజ్ ఫ్రెష్ పేరున పీఎంపాలెం మాస్టర్ ప్లాన్ రోడ్డులోనూ, 7 వ వార్డు వుడాకాలనీ రోడ్డులోనూ బహుళ అంతస్తుల భవనంలో ఒకేమారు డిపార్టుమెంట్ స్టాల్స్ ప్రారంభించింది. నిత్యావసర సరకులు తోపాటు పండ్లు, కూరగాయలు, గృహోపరణాలు, పూజా సామగ్రి ఈ స్టోర్స్లో లభిస్తాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు రూ.వెయ్యి చెల్లి మెంబర్ షిప్ కార్డు పొందితే స్టోర్లో కొనుగోలు చేసిన ప్రతి వస్తువుపై 10 శాతం డిస్కౌంట్ ఇస్తామని నిర్వాహకులు చెప్పారు.
దీంతో ఈ ప్రాంతంలో వందలాది మంది మెంబర్ షిప్ తీసుకున్నారు. అయితే గత నెల 28న రెండూ స్టోర్స్ మూసివేశారు. ఎందుకు మూసివేశారో అక్కడ సమాధానం చెప్పేవాళ్లు లేకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఫిబ్రవరి చివరి వారంలో కూడా మెంబర్ షిప్ తీసుకున్నారు. ఇలా అకస్మాతుగా స్టోర్స్ మూసివేసి వినియోగదారులను మోసం చేయడం తగదని పలువురు బాధితులు పేర్కొన్నారు.