కరోనా పేషెంట్లను పరామర్శించిన చెవిరెడ్డి

13 Aug, 2020 15:31 IST|Sakshi

స్విమ్స్‌ స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో ఎమ్మెల్యే పర్యటన, రోగులకు భరోసా

సాక్షి, తిరుపతి : కోవిడ్‌ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి అనునిత్యం కృషి చేస్తున్నారని, ప్రతిరోజు కోవిడ్‌ ఆస్పత్రుల పనితీరుపై సమీక్ష చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి తిరుపతిలో కోవిడ్ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాల గురించి తెలుసుకోవడానికి స్విమ్స్‌లోని స్టేట్ కోవిడ్ ఆస్పత్రిని స్వయంగా సందర్శించారు.

పీపీఈ కిట్ ధరించి 330 మంది పేషెంట్లను స్వయంగా కలిసి వారితో మాట్లాడారు. ప్రతి పేషెంట్‌ వద్దకు వెళ్లి వాళ్లకు అందుతున్న వైద్య సేవలు సౌకర్యాల గురించి తెలుసుకొన్నారు. భయపడాల్సిన పనిలేదని చికిత్సతో నయం అవుతుందని భరోసా ఇచ్చారు.  అనంతరం చెవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో కోవిడ్ ఆస్పత్రులను సందర్శించి అక్కడి వైద్య సేవల గురించి తెలుసుకొంటున్నట్లు తెలిపారు. (నిల్వ చేసిన కోడి రెక్కల్లో కరోనా: చైనా)


స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రిలో మంచి వైద్య సేవలు అందుతున్నాయని అలాగే సౌకర్యాలు కూడా బాగున్నాయని అన్నారు. అలాగే లోపాలు ఉంటే సరి చేయడమే తమ లక్ష్యమని, కోవిడ్‌ ఆస్పత్రుల మీద 45 రోజులుగా తిరుపతిలో సమన్వయ కమిటీ పని చేస్తోందన్నారు. అధికారులతో కలిసి రోజుకు 18 గంటలు పని చేస్తున్నామని, ఎక్కడా లోపం ఉండకూడదన్నదే తమ ఆలోచనగా పేర్కొన్నారు. (రెమ్డెసివిర్ : చౌక మందు లాంచ్)

 

మరిన్ని వార్తలు