పది రోజుల్లో కౌంటర్లు దాఖలు చేయండి

5 Aug, 2020 04:07 IST|Sakshi

అప్పటి వరకు యథాతథస్థితి కొనసాగించండి 

పరిపాలనా వికేంద్రీకరణ,సీఆర్‌డీఏ చట్టం రద్దుపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

విచారణ ఈ నెల 14కి వాయిదా

సాక్షి, అమరావతి: పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దుకు సంబంధించి జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్లను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడంతో పాటు చెల్లుబాటు కానివిగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై పది రోజుల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. అప్పటివరకు కార్యాలయాల తరలింపుపై యథాతథస్థితి (స్టేటస్‌కో) కొనసాగించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 14వతేదీకి వాయిదా వేసింది.

రాజధాని తరలింపునకు సంబంధించిన అన్ని వ్యాజ్యాలను ప్రస్తుత వ్యాజ్యాలకు జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయ మూర్తులు జస్టిస్‌ రాకేశ్‌ కుమార్, జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు,  మరికొందరు దాఖలు చేసిన వ్యాజ్యాలపై  ధర్మాసనం ప్రత్యేకంగా విచారించింది.

అది విధానపరమైన నిర్ణయం..
పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ వాదనలు వినిపిస్తూ ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం కోసం రైతులందరూ స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది రాకేష్‌ ద్వివేదీ జోక్యం చేసుకుంటూ ఈ వ్యాజ్యాల్లో పూర్తి వివరాలతో పది రోజుల్లో కౌంటర్లు దాఖలు చేస్తామని, కార్యాలయాలు ఎక్కడ ఉండాలన్నది పూర్తిగా కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోని అంశమని వివరించారు.

మరిన్ని వార్తలు