అటవీ భూములు ధ్వంసం చేస్తుంటే మీరేం చేస్తున్నారు?

22 Jul, 2021 03:29 IST|Sakshi

కొండపల్లి అడవుల్లో మైనింగ్‌పై అధికారులను ప్రశ్నించిన హైకోర్టు

సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లాలోని కొండపల్లిలో ఉన్న రక్షిత అటవీ భూముల్లో మైనింగ్‌ చేస్తూ, అడవులను ధ్వంసం చేస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.

కృష్ణా జిల్లా, పరిటాల గ్రామ పరిధిలోని ఇబ్రహీంపట్నం ప్రధాన పంట కాలువను అక్రమ మైనింగ్‌దారులు కనుమరుగు చేశారని, ఈ కాలువను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వడంతో పాటు కొండపల్లి అటవీ భూముల్లో మైనింగ్‌ చేస్తున్న ఘటనలపై స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు చేయించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎన్‌వీ సుమంత్‌ వాదనలు వినిపించారు.  

మరిన్ని వార్తలు