ఇంటింటా కరోనా బడ్జెట్‌..!

28 Jul, 2020 09:08 IST|Sakshi
మాస్క్‌లు కొనుగోలు చేయాల్సిందే...

జీవనంలో భాగమైన మాస్క్‌

పెరిగిన శానిటైజర్ల వినియోగం

పరిశుభ్రతకు ప్రాధాన్యం

గుడ్డు, నిమ్మకాయలు, డ్రైఫ్రూట్స్‌ కొనుగోలుపై ఆసక్తి

ఒక్కో కుటుంబానికి నెలకు రూ.1090 అదనపు ఖర్చు 

జిల్లాలో 5,87,149 కుటుంబాలు

పేద, మధ్య తరగతి కుటుంబాలకు భారం 

కొత్తవలస: కరోనా.. ఆరోగ్యంతో పాటు ఇంటి బడ్జెట్‌నూ భారంగా మార్చింది. శానిటైజర్లు, మాస్క్‌ల వినియోగం తప్పనిసరి చేసింది. చేతుల శుభ్రత ప్రాధాన్య అంశంగా మారింది. వీటి కి తోడు రోగనిరోధక శక్తి పెంపొందించుకునేందుకు  సి– విటమిన్‌ అందించే పండ్లు, కూరగాయలతో పాటు అదనపు ఆహారంగా డ్రై్రçఫూట్స్, గుడ్లు తీసుకోవడంతో ప్రతి ఇంటా కరోనా బడ్జెట్‌ పెరిగింది. సంపన్నకుటుంబాలకు పెద్దగా ఆర్థిక భారం కాకపోయినా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు మాత్రం ఖర్చు భారంగా మారింది. నెలకు సుమారు రూ.1090 అదనపు ఖర్చు అవుతోంది. చేసేది లేక ప్రతి కుటుంబం నెలవారీ ఖర్చుతో పాటూ కరోనా ఖర్చును మౌనంగా భరిస్తున్నారు.  

జిల్లా ప్రజలపై భారం...  
జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 23,44,474(23.4) జనాభా, 5,87,149 కుటుంబాలు ఉన్నాయి. కొత్త గణాంకాల ప్రకారం మరో 10 శాతం జనాభా ఉంటారని అంచనా. ఈ లెక్కన పెరిగిన నెలవారీ కరోనా బడ్జెట్‌ సుమారు రూ.60 నుంచి 70 కోట్లు ఉండొచ్చని అంచనా. పరిశుభ్రత ఖర్చు తప్పనిసరి కావడంతో పేద, మధ్య తరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌ పూర్తిగా మారిపోయింది. చాలీచాలని జీతాలు, కూలి డబ్బులతో గడిపే కుటుంబాలకు ఈ బడ్జెట్‌ భారంగా మారింది. 

శుభ్రత ఖర్చు పెరిగింది..  
కరోనా వైరస్‌ వ్యాప్తి తో ఇంటితో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకో వడం అలవాటు చేసుకున్నాం. దీనికోసం శానిటైజర్లు, లైజాల్, ఫినాయిల్, హార్పిక్‌ వంటివి వినియోగం పెరిగింది.  దీంతో ప్రతినెల ఖర్చులు పెరిగాయి. 
– బొడ్డు గోవిందరావు, కాంట్రాక్టు ఉద్యోగి, తుమ్మికాపల్లి

శానిటైజర్‌ కొనుగోలు చేస్తున్న పట్టణవాసి  

అదనపు భారం
మా ఇంట్లో ఆరుగురం ఉంటున్నాం. కరోనా బారిన పడకుండా అందరికీ మాస్క్‌లు కొనుగోలు చేస్తున్నాం. శానిటైజర్లు విధి గా వాడుతున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లి వచ్చినప్పుడు దుస్తులు తరచూ ఉతకాల్సి వస్తోంది. దీంతో నెలకు రూ.1500 అదనపు ఖర్చు పెరిగింది. 
– దాసరి శ్రీదేవి, ఉద్యోగిని, కంటకాపల్లి

ఇబ్బంది అయినా తప్పదు  
ఇంటిలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రస్తుత పరిస్థి తుల్లో జాగ్రత్తలు తప్పనిసరి. మాస్క్‌లు, శానిటైజర్లు, సబ్బులు వాడకం పెరగడంతో నెలవారీ ఖర్చు పెరిగింది. రూ.1000 నుంచి రూ.1500 ఖర్చు చేయాల్సి వస్తోంది.  
– ఎం.లక్ష్మి, కొత్తవలసటౌన్, మసీదు వీధి
 

మరిన్ని వార్తలు