కొనసాగుతున్న కోలాహలం

11 Jan, 2021 03:38 IST|Sakshi
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి లే–అవుట్‌ వద్ద పట్టాలు అందుకున్న లబ్ధిదారులు

రాష్ట్రవ్యాప్తంగా 17వ రోజూ కొనసాగిన ఇళ్ల పట్టాలు, టిడ్కో ఇళ్ల పంపిణీ

చిరకాల స్వప్నం నిజమైందంటున్న పేదలు

సీఎం వైఎస్‌ జగన్‌కు రుణపడ్డామంటున్న లబ్ధిదారులు

నేడు పట్టాల పంపిణీకి విరామం.. రేపటి నుంచి పంపిణీ యథాతథం

సాక్షి నెట్‌వర్క్‌: ‘వదినా.. నీ స్థలం ఎక్కడొచ్చింది. రాఘవత్తా.. నీకు ప్లాటెక్కడిచ్చారు. పోనీలే భార్గవీ ఇన్నాళ్లకు నీకు ఇల్లొచ్చింది. నీ కల నెరవేరింది. ఇక నీ దిగులు పోయినట్టే..’ ఊరూరా ఎక్కడ చూసినా ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టిన ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 17వ రోజైన ఆదివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాలు, టిడ్కో ఇళ్ల పంపిణీ కోలాహలంగా సాగింది. అనంతపురం జిల్లాలో ఇప్పటివరకు 80,985 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలం పట్టాలు, 15 వేల మందికి టిడ్కో ఇంటి పత్రాలను ఎమ్మెల్యేలు పంపిణీ చేశారు. వైఎస్సార్‌ జిల్లాలో 72 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 1,02,225 మంది పట్టాలు పొందారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆదివారం 7,239 మందికి ఇంటి పట్టాలు, టిడ్కో హక్కు పత్రాలు అందజేశారు.ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో 1,751 టిడ్కో ఇళ్ల పత్రాలను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పంపిణీ చేశారు. గుంటూరు జిల్లాలో 17వ రోజున 917 మందికి పట్టాలిచ్చారు. వెల్దుర్తి మండలంలో ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పట్టాలు పంపిణీ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం 669 మంది పట్టాలు అందుకోగా.. ఇప్పటివరకు 2,41,400 మంది లబ్ధి పొందారు. శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం 2,506 ఇళ్ల పట్టాలను అందించారు. 17 రోజుల్లో 60,101 మంది పట్టాలు అందుకున్నారు. విజయనగరం జిల్లాలో ఆదివారం 250 మందికి ఇళ్లపట్టాలు, టిడ్కో ఇంటి పత్రాలు అందజేశారు. ఇప్పటివరకు జిల్లాలో 77,676 మంది లబ్ధి పొందారు.

నేడు విరామం
అమ్మ ఒడి పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రెండో ఏడాది సొమ్ము జమ చేయనున్న దృష్ట్యా సోమవారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం విరామం ప్రకటించింది. అధికారులంతా అమ్మఒడి కార్యక్రమంలో నిమగ్నమై ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి ఇళ్ల పట్టాలు, టిడ్కో ఇళ్ల పంపిణీ యథాతథంగా కొనసాగుతుంది.

ఈ చిత్రంలో పట్టా అందుకుంటున్న మహిళ పేరు సజ్జల హేమలత. అనంతపురంలోని 25వ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌. ఈమె టీడీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక పథకాల అమలులో కులం, మతం, వర్గం, పార్టీలు చూడకుండా.. అర్హులందరికీ పథకాలను వర్తింప చేస్తామని సీఎం
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రాజకీయాలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా ఆదివారం అనంతపురం సమీపంలోని కురుకుంట లే–అవుట్‌లో సజ్జల హేమలతకు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పట్టా అందజేశారు. పార్టీలు చూడకుండా, పూర్తి పారదర్శకతతో టీడీపీ నేతకూ లబ్ధి చేకూర్చిన ప్రభుత్వ తీరును అంతా ప్రశంసించారు. 

మరిన్ని వార్తలు