నిర్విఘ్నంగా పట్టాల పంపిణీ

18 Jan, 2021 04:39 IST|Sakshi
తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో ఇళ్లపట్టాల పంపిణీకి తరలివచ్చిన మహిళలు

సాక్షి నెట్‌వర్క్‌: పేదలకు విలువైన స్థిరాస్తిని ఇచ్చే మహాయజ్ఞాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించినప్పటి నుంచి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా  24వ రోజైన ఆదివారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కోలాహలంగా సాగింది. విశాలమైన లే–అవుట్లు, ఆహ్లాదకరమైన పరిసరాల మధ్య ఉన్న తమ ప్లాట్లను చూసి మహిళలు మురిసిపోతున్నారు. సొంతింటి కల సాకారం అవుతోందన్న ఆనందం అక్కచెల్లెమ్మల మోముల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. విశాఖ జిల్లాలో ఆదివారం ఒక్కరోజే 2,044 మందికి ఇళ్ల పట్టాలు అందజేశారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో 1,551 మందికి ఇంటి పట్టాలు, టిడ్కో ఇళ్ల పత్రాలు అందజేశారు. జిల్లాలో ఇప్పటివరకు 81,804 మంది లబ్ధిదారులు ఇంటిపట్టాలు అందుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆదివారం 1,813 మందికి ఇళ్ల పట్టాలిచ్చారు.

బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీ మార్గాని భరత్‌రామ్, ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 1,822 మందికి పట్టాలిచ్చారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం మేకవానిపాలెంలో 194 మందికి, తాళ్లపాలెంలో 417 మందికి రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పట్టాలు అందించారు. గుంటూరు జిల్లాలో 1,756 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. హోం మంత్రి మేకతోటి సుచరిత, డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నంబూరు శంకరరావు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ఆదివారం ఒక్కరోజే 2,150 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.24 రోజుల్లో మొత్తం 65,510 మంది ఇంటి స్థలాలు పొందారు. 4,252 టిడ్కో ఇంటి పత్రాలు అందుకున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆదివారం 2,249 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు